ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడ వుండాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులేని ఆ విద్యావిధానమంటే వారికి భయందోళనలే మిగిలాయి. క్రమశిక్షణ పేరిట నిత్యమూ అరవిందమాత భజన, ధ్యానం చేయించే విద్యావిధానమది.

జీవితంలో ఎక్కడో అనుకున్నది సాధించలేనివారు, జీవితమంటే విసుగెత్తినవారు, రిటైరైనవారు చాలామంది అక్కడకు వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అయితే వీరంతా బాగా డబ్బున్నవారే. ఆశ్రమంలో అలగాజనానికి, డబ్బులేనివారికి చోటులేదు. అదొక ఖరిదయిన వింతైన ఆశ్రమం. డబ్బిస్తే యిక్కడ అన్నీ అభిస్తాయి.

డబ్బిస్తే కోతి దిగి వస్తుంది:

కొంత డబ్బు ముట్టజెపితే, పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడం, ఫోటోలపై మాత సంతకం చేయటం, దీవెనలు పంపటం యిత్యాదులెన్నో జరుగుతవి. డబ్బు పంపకుండా దీవెనలు అడిగితే ఉత్తరానికి జవాబురాదు. ఇది స్నేహితుల అనుభవం స్వయంగా చూచినది.

రెండో పర్యాయం వెళ్ళీనప్పుడు మాత ధర్మదర్శనం మేడపై నుండే యిచ్చింది. క్రింద వీధిలో భక్తులు నిలబడ్డారు. పైన ఫోటోలు తీశారు, ఫిలిం తీశారు. ఈ తంతు అయిన తరువాత సముద్రస్నానం చేయాలట. అక్కడ బీచ్ లో కొంచెం దూరం వెళ్ళగా బెస్తవారున్నారు. తమ స్థలాల్ని ఆశ్రమం వారు కాజేసి తమను నిరాశ్రయుల్ని చేసిన ఉదంతాన్ని వారు చెప్పారు. మొత్తంమీద ఊళ్ళో ఎక్కడికెళ్ళినా ఆశ్రమాన్ని గురించి దారుణంగా మాట్లాడారు. ఆశ్రమంలో తమిళేతరులు మాత్రం మాత మరణించిందని ప్రచారం చేశారు. 1973 నవంబరు 17న, 94 ఏళ్ళకు ఆమె మరణించింది. ఎప్పటి పాటే పాడారు. ఆమె చనిపోలేదట. ఇంకా పెద్ద పనులేవో చేయటానికి అరవిందుని సన్నిధికి వెళ్ళినదన్నారు. ఏదైనా ఆశ్రమంలో వస అంతటితో తగ్గింది. కాగా అదొక భారీ పరిశ్రమ గనుక నడుస్తున్నది.

ఈలోగా అంతర్జాతీయ నగరం పేరిట అరోవిల్ అనే సిటీ నిర్మిస్తున్నారు. దాని వలన స్థానికులు చాలామంది నివాసాల్ని కోల్పోతున్నారన్న విషయం అట్లా వుంచండి అది విలాసపురుషుల భోగలాలసత్వానికి పనికొచ్చే ఇంద్రజాల నగరంవలె పథకం వేశారు గాని మరేమీ కాదు. మన సమాజంలో ఇమిడే నగరం కాదది.

భక్తుల ప్రభావం:

అరవిందాశ్రమాన్ని గురించి ప్రచారం చేయటానికి అక్కడక్కడా పలుకుబడిగల, డబ్బున్న భక్తులున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు వీరు వ్యాపించివున్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీరు నిత్యమూ ఆశ్రమ భజన యితరులచే చేయిస్తుంటారు. ఏదో పేరిట డబ్బు వసూలు చేస్తారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో హ్యూమన్ స్టడీస్ అనే పేరిట నడుస్తున్న వ్యవహారమంతా అరవిందుని భజనే. ఫిలాసఫీ సిలబస్ లో అరవిందుని మయం చేశారు. విద్యార్థుల్ని అట్లా పరోక్షంగా, ఏమీ ఎరగనట్లు వశం చేసుకోవటం ఒక కళ.