ధాన్యకటకమునకు వెనుక నింతటి విశాలమైన నగరము నింతటి మనోహరమైన పట్టణము దక్షిణాపధమున నింకొకటి పూర్వము లేకుండెను. ఇపుడీ నగరము భూకంపాదులచే నశించిపోయి శిధిలా వశిష్టమయి పాడయి రూపు మాసియున్నది. ఇచ్చటి పురాతన చిహ్నములు ప్రాచీనపు టౌన్నత్యమును దలపునకు దెచ్చుచున్నవి.
వేంగీపురము పల్లవుల కాలమున రాజధానిగా నుండెను. వారికి వెనుక సాలంకాయన పల్లవులకును, పిమ్మట విష్ణుకుండినులకును రాజధానిగ బరగెను. చాళుక్యులీదేశమును జయించిన తరువాత కొంతకాలము పిష్ఠపురము రాజధానిగా మార్చబడినను చాళుక్యరాజులలో రెండవ వాడగు జయసింహుని కాలమున వేంగీపురమునకు తిరిగి రాజధాని మార్చబడెను. యువాన్ చ్యాంగ్ వేంగీపురమున కేతెంచినపుడు వేంగీదేశమును కళింగములో చీపురుపల్లి ప్రాంతము వరకును తూర్పు చాళుక్య పరిపాలనము క్రింద నుండెను. అపుడు తూర్పు చాళుక్యరాజ్యమును బాలించుచుండిన వాడు సర్వసిద్ధి బిరుదాంకితుడగు జయసింహవల్లభుడు.
వేంగీపుర ప్రాంతమున నుండినట్లు చెప్పబడిన సంఘారామము ఇపుడు గానరాదు. ఇదియును కాల మహిమచే శిధిలమయి జీర్ణమై పోయియుండును. వేంగీపుర ప్రాంతము నిపుడు పెదవేగి చిన్నవేగి దెందులూరు సేనగూడెము మున్నగు గ్రామముల చెంత గానవచ్చు శిధిలమయిన దేవాలయములు