ఆ సొరంగము 10 లీలు (6 మైళ్ళు) నిడివి గలిగియున్నది. ఆ కొండక్రింది నుండి మేము సొరంగమును బ్రవేశించు మార్గము గానక, పైకి చూచునప్పుడు నేటవాలుగ నుండిన యా యెత్తైన పర్వతముచుట్టును, పొడవునను, సొరంగములవలె నుండు గుహలను జూచితిమి. ఆ సొరంగమందు, నడచుట కనుకూలములుగ నుండి యిరుప్రక్కల స్థంభములు గలిగి, పొడవుగా నున్న విహారములును, ఎత్తైన గోపురముల క్రింద వసారాలుగల ఐదంతస్తుల కట్టడము నొకదానిని జూచితిని. ఆ యంతస్తులలో నొక్కొక్క దానియందు నాలుగేసి విహారములు గలవు. విహారములకు నడుమ వానిని చుట్టుకొను పడసాలలు (లేక వసారాలు) గలవు. ఆ విహారములందొక్క దానియందు సువర్ణమయములయిన బుద్ధుని జీవప్రతిమలు గలవు. అవి నవరత్న ఖచితములయి, చిత్ర విచిత్రాలంకారములతో శోభిల్లుచున్నవి. ఈ పర్వతాగ్రము నుండి, సెలయేటిధారల కాల్వలు ప్రతి యంతస్తునందును, మంటపముల గుండను, వసారాలచెంతను, విహారముల చుట్టును బ్రవహించుచు, కొండక్రిందకు బ్రవహించుచుండును. అచ్చటచ్చట గుహలపై గానవచ్చు సొరంగములు, పైనుండి లోపలిగుహలోనికి విహారములలోనికి, గాలిని వెలుతురును బోనిచ్చుచు, వాటిని కడు రమణీయములుగను, నివాస యోగ్యములుగను జేయుచున్నవి.
సాద్వహరాజీ పర్వతమును దొలిపించి సంఘారామ