ముప్పదియైదవ ప్రకరణము
సంతానులు థామసును బట్టుకొనుట
ఆపదివేగురు సంతానులును "వందేమాతరం” పాడుచు బల్లెములను పట్టుకొని యతి వేగముతో ఫిరంగు లుండుచోటికిఁ బోయి పడిరి. గుండ్ల వానయందు సంతానులు ఖండ విఖండములై విదీర్ణులై ఉత్పతితులై యత్యంత విశృంఖలులై పోయిరి. అయినను, సంతాన సైన్యము వెనుదీయ లేదు. ఆసమయమున, కేష్ట౯ థామసు ఒక సిపాయీల దండును జూచి, తుపాకులను బారుచేసి సంతానుల దక్షిణపార్శ్వమునం దాక్రమింపవలయునని సెల వొసంగెను. అప్పుడు రెండు వైపుల నున్న సంతాను లొకేసారి నిరాశులైరి. ఒక్కోక నిమిషంబునకు నూర్ల కొలఁది సంతానులు నష్ట మగుచు వచ్చిరి. అప్పుడు జీవానందుఁడు, “భవానందా! నీవు చెప్పినదే నిజమాయెను. ఇంక వైష్ణవుల ధ్వంసము ప్రయోజనము లేదు; 'మెల్ల మెల్లగా తిరిగి పోవుద” మనియెను.
భవానంద——ఇప్పుడు తిరిగిపోవు టెట్లు! ఇప్పుడు తిరిగి పోవువారును జచ్చిపోదురు.
జీవానంద—— ముందు ప్రక్కనుండియు, కుడి ప్రక్కనుండియు నాక్రమించి యున్నారు, ఎడమప్రక్క నెవరును లేరు; పద; మెల్ల మెల్లగా జరిగి యెడమ ప్రక్కను పోదము.
భవానంద—— జరిగి యెక్కడికి పోయెదవు? ఆ ప్రక్కను అజయనది; క్రొత్త వానచే అజయ ప్రవహించుచున్నది. ఆంగి