శ్రీరస్తు
అడిదము సూరకవి
మొదటి ప్రకరణము
వంశపూర్వ చారిత్రము—గృహనామము
చ. ఇరువదిమూఁడు పూరుషము లిప్పటికయ్యెఁ గవిత్వవృత్తిచే
నరపతు లెల్ల మెచ్చఁ బదునాల్గుతరంబులు మించుపిమ్మటన్
వెరవగుజీవనస్థితి లభించుట, తొమ్మిదియయ్యెఁ బూరుషాం
తరములు నిక్కళింగ వసుధాధవుచెంగట నాశ్రయించుటల్.
(సూరకవి చాటుధార.)
ఆంధ్రదేశమునఁ గవితావృత్తిచేఁ బ్రఖ్యాతిగాంచిన నియోగికుటుంబములలో నడిదమువారి కుటుంబమొకటియని చెప్పనగును. తొలుదొల్త వీరియింటి పేరు ‘మోదుకూరువారు’. ఈకుటుంబమునఁ గొందఱు ప్రసిద్ధకవులు తమ గ్రంథములను నేనుంగులపైని వేసికొని దేశాటనముచేయుచు రాజస్థానములను దర్శించి జీవయాత్ర గడపుచువచ్చుటచేతఁ గొంతకాలము వీరికి “గ్రంథవారణము” వారనియు గృహనామము గలిగి యుండెడిది. మఱికొంత కాలమునకుఁ బిదప నీవంశజులలో నొకఁడగు నీలాద్రికవి కళింగరాజులలో నొకనియొద్ద నాస్థానకవిగానుండి యొకానొక సమయమునఁ దనప్రభువుతోఁగూడ యుధ్ధమునకై వెడలెను. బ్రాహ్మణుఁడయ్యును నపరద్రోణాచార్యునిపగిది నీలాద్రికవి యుధ్ధరంగమున వెల్లడించిన సాహస