పుట:2030020025431 - chitra leikhanamu.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

నల్లనిబట్టలకు, సిపియాను, క్రిమిజనులేకును, ఇండిగోరంగును కలిపి వేయుదురు.

పసుపుపచ్చని బట్టలఛాయకు బరంటుశయనాను, వేండిక్కుబ్రౌనును ఉపయోగింతురు. బట్టకు వేయుటకు గెంబోజిని ఇండియాపసుపును ఉపయోగించుట మంచిది.

వెనుకభాగము:- వెనుకభాగములు సులభముగ చిత్రించవచ్చు నని యిదివరకు చెప్పి యుంటిని. సాధారణముగ వీటిని చిత్రించుట సులభమే. కాని యిందు ప్రవీణత కలుగజేసికొనుట కష్టము సర్ జోషువా రేనాల్డ్సు దొరగారు చిత్రము నంతను శిష్యులచేత వ్రాయించి వెనుకభాగములనుమాత్రము తామే చిత్రించుచు వచ్చిరట. ముఖమును బాగుగ చిత్రించుట వచ్చిననేకాని యీవిషయమై విద్యార్థులు తలపెట్టరాదు. కాని వారిసహాయార్థమై యిందు కొన్నియంశములను పొందుపఱుచుచున్నాను.

ముఖమే చిత్రమునందు ప్రధానము. అందువలన నీవెనుకభాగములు ప్రకాశమాన మైనరంగులతో చిత్రించరాదు. ఇటుల చేసినయెడల చిత్రముయొక్క ప్రాముఖ్యము తగ్గిపోవును. ఒకేవిధ మగురంగుతో దీనిని చిత్రించరాదు. వివిధ మైనరంగులను కలిపి మోటుగా పూయుట మంచిది. ఈరంగు కొన్నిభాగములయందు దట్టముగను, కొన్నిచోట్ల పలుచగను వేసినయెడల చిత్రమువెనుక నేదో యొకరంగు కాగిత మంటించినటుల కానరాదు.

చిత్రమువెనుక నేదైన ప్రదేశచిత్రము వ్రాసిన, అం దుండువస్తువులు తక్కువగా నుండవలెను. వీటికి గాడమైన రంగులను వేసి ప్రాముఖ్యము నివ్వకూడదు. ఈవిషయము ప్రదేశచిత్రపటములయందుకూడ పనికివచ్చును. ఇట్టి సమయమునందు ఆకాశపురంగు ఎఱుపుసంబంధ మైనదిగ నుండిన మంచిది. వేండిక్కును రీనాల్డ్సును వారిచిత్రముల వెనుకభాగములయందు ప్రదేశచిత్రములనే విశేషము చిత్రించిరి. ప్రధానచిత్రమునందు గాడ మైనరంగులను వేసియుండిన వెనుకభాగములకుగూడ కొంచెము దట్ట మైనరంగులను వేయవలెను. ఛాయ ముఖమునందు దట్టముగ లేనియెడల వెనుకభాగమునకు కొంచెము తేలికరంగు వేయుట మంచిది.

వెనుకభాగములకు నీలిని, ఎఱుపును పలుచగ వేయవచ్చును. ఎఱుపు వెనుకభాగమునం దుండునటుల చిత్రించుట యిందు చెప్పెదను. వెనుకభాగమునందు ఎఱుపువస్త్ర ముండినటుల వ్రాయవలె ననిన, ప్రధాన మైనముడుతలను, ఛాయను సిపియాతో మొదట చిత్రించి,పిమ్మట కారుమైను ఎఱుపును పలుచగ వేయవలెను. ఇది బాగుగ నారినపిమ్మట గెంబోజిపసుపును పలుచగ వేయుము. ఛాయను, ముడుతలను, సిపియాతోను, అమిజనులేకుతోను వేండిక్కుబ్రౌనుతోను బాగుగ కనుపడునటుల చేయవలెను. పిమ్మట నీరంగులపై సిపియాను వేండిక్కుబ్రౌనును వేసి చక్కచేయవలెను.

వెనుకభాగమునకు నీలిరంగును వేసినయెడల ముఖముయొక్క ప్రాముఖ్యము తగ్గిపోవును. కాని యీరంగుయొక్క గాడమును, యిండియా యెఱుపుతోను, సిపియాతోను తగ్గించవచ్చును.

పసుపుపచ్చనిరంగును వెనుకభాగమునకు వేసి, బరంటుశయనారంగుతోను, వేండిక్కుబ్రౌనురంగుతోను, సిపియాతోను ఛాయ నివ్వవలెను. పసుపురంగుయొక్క ప్రాముఖ్యమును తగ్గించవలె నన్న నీలిని వేయరాదు. ఇటుల వేసినయెడల అంతయు ఆకుపచ్చ నైపోవును. నీలితో కొంచె మెఱుపును కలిపి ఉపయోగించవచ్చును.

వెనుకభాగములయందు ప్రదేశచిత్రమును వ్రాయవలె నన్న దూరముగ నుండుస్థలమును, ఆకాశమును, కోబాల్టునీలితో చిత్రించవచ్చును. మేఘములకు తేలిక యైనఎఱుపురంగును, నీలిని, ఇండియాయెఱుపును పూయవచ్చును. దగ్గరనున్నస్థలములకు సిపియాను, ఇండిగోరంగును వేయవచ్చును. దూరముగ నున్న చెట్లకు పసుపును,