స్థలము 7 : కొలువుకూటము.
__________
[శాంతవర్మయు విజయవర్మయు కూర్చుండి, తెరయెత్తునప్పటికి సంభాషించు వైఖరిలో నుందురు.]
శాంతవర్మ : [దు:ఖముతో] అయ్యో! యింకెక్కడి రాజశేకరుఁడు! ఇంకను బ్రతికియున్నాఁడా? రాత్రియంతయు దివిటీలువేయించి యడవి యంతయు వెదకించితిని - మీరేల వాని నొంటరిగ వదలివచ్చితిరి?
విజయవర్మ : నేనెంత బ్రతిమాలినను వినక యుత్తరపు దిక్కునకు పోయెను. నేనుగూడ వెంబడింపఁ దలఁచితినిగాని, గొడ్డటితో చీల్చినట్టు తలనొప్పి పుట్టుచుండెను. విశ్రమింపవలయునని యింటికి వచ్చితిని. మాధవవర్మగారు మాత్రము అడవియందే యుండిరి.
శాంత : ఏమీ, మాధవుఁడచ్చట నుండెనా? మాధవుఁడేఁడి? - మాధవా.
[మాధవవర్మ ప్రవేశించును.]
శాంత : నీవుకూడ వేఁటకు పోయియుంటివా?
మాధవవర్మ : లేదు. ఏదూరదేశమైన పరుగెత్తి పోవుటకు పోవుచుంటిని కాని, నావిధి మరల నన్ను వెనుకకు మరలించినది.
శాంత : ఇదియేమి వెఱ్ఱి?
మాధ : ఇంతవఱకు పరగృహ వాసముయొక్క దైన్యమును పారతంత్ర్యమును నేనెఱుంగను. మీవాత్సల్యముచేత మైమఱచి యుంటిని. ఆ మధురస్వప్నమునుండి రాజశేఖరుఁడు నన్ను మేల్కొలిపెను. పదిజన్మము లెత్తినను మీ ఋణము నేను తీర్చుకొనఁజాలను; లేక యుండిన మాయిరువురిలో నెవరైన నొకరు మరణించియుందురు.