కవికోకిల గ్రంథావళి
మనో : మాధవుఁడు నివుఱుగప్పిన నిప్పు.
[మాధవవర్మ అన్యాయత్త చిత్తుఁడయి క్రింద చూపుతో ప్రవేశించును.]
శ్యామ : అమ్మా, వారుగో! మాదవయ్య దొరగారు, ఇక్కడికే వస్తున్నారు.
మనో : [ఆతురతతో] ఏఁడి? - [చూచి] పాతాళ పర్యంతము నంటుచూపు! మొగ మేదియో ఘోరనిర్ణయమును ప్రకటించుచున్న్నది! - మాధవా, ఏమి యీ స్వరూపము?
మాధవవర్మ : [మెల్లఁగ తలయెత్తిచూచి] మనోరమా, యదృశ్య శక్తి యాహ్వానము బలవత్తరము. స్వతంత్ర జీవిత యాత్రా మహాసముద్రావర్తనమున ఏకాకినై దుముకఁ బోవుచున్నాను. వీడ్కొలుపుము.
మనో [కలఁతచెంది] నీమాటలు నాకర్థమగుటలేదు. ఏమి యాత్ర? వీడ్కొలుపుట యేమి?
మాధ : ఇంకొక్క నిమిషమైనను ఈ యవమానకరమైన జీవనమును గడపఁజాలను. ఓర్పునకుఁగూడ నొక మేరయుండును. నే నెవ్వఁడను? మీ యింట నే నేల యదవత్రావుడు త్రాగుచుండవలయును? అజ్ఞాతజన్ముఁడను, పవిత్రమగు మీ కులీనత కేల కళంకము తేవలయును?
మనో : మాధవా, నిన్నెవరైన దూషించిరా? రాజశేఖరుఁ డేమైన కానిమాటలు పల్కెనా? తండ్రితొందరపడి కోపగించుకొనలేదుగదా?
మాధ : ఒక్కరాజశేఖరుఁడేకాఁడు, నేను జూచు ప్రతిపదార్థమును న న్నవమానించుచున్నది. పారతంత్ర్య విషవాయువునందు నాయౌవన కుసుమము వివర్ణమయి జీర్ణించిపోవుచున్నది. కఱకుటమ్ములను నిష్కవచమైన నావక్ష:స్థలముతో నెదుర్కొనఁగలను గాని, మర్మభేదకములగు నెత్తిపొడుపు