227 మాధవ విజయము
రాజ : [తండ్రిప్రక్కనకూర్చుండి] అవును! సమయమునకే వచ్చితిని, నేఁడే సర్దారు పంజాబు గుఱ్ఱముల బిడారును వజ్రపురికి కదలించుచున్నాఁడు. ఈసమయము తప్పిన నొకకుంటి గుఱ్ఱము కూడ మనకు దొఱకదు.
శాంత : గుఱ్ఱపు బిడారేమిటి?
రాజ : పంజాబుసర్దారు కందుకకేళి యలవడిన బొమ్మలవంటి యవనాశ్వములను అమ్మకమునకై మన పట్టణమున నిల్పియున్నాఁడు.
శాంత : రాజశేఖరా, నీ కందుకకేళి పిచ్చి మితిమీరుచున్నది. నిరుడు కొన్నవికాక ఈ యేడును గుఱ్ఱములు కొనవలయునా? ప్రతిసంవత్సరమును వానిపోషణమునకు తరిబీదునకు రెండులక్షల రూపాయలు ఖర్చు పెట్టుచున్నావు. ఒక్క పందెమైన గెలిచితివా? మహాభారతమున -
రాజ : [విసుగుతో] మీ మహాభారత పురాణ శ్రవణమునకు తీఱికలేదు. నేను పదిగుఱ్ఱములు కొనవలయును.
యశో : [కన్నురుముచు] ఆ! శేఖరా, నీవింకను మట్టు మర్యాదలు నేర్చుకొనవు.
శాంత : [కోపముతో] ఈ యవిధేయత నేనొక్కక్షణమై నోర్చుకొనను. [భార్యతట్టుతిరిగి] ఇదియంతయు నీగారాబము - నీ చనవు - వీనికి తృణీకరభావము తుంటరితనము హెచ్చి పోవుచున్నది. మాధవునికిని వీనికిని ఎంతయో తారతమ్యము గలదు.
రాజ : అవునవును. మాధవుఁడు మీకడుపునఁబుట్టిన బిడ్డకదా!
శాంత : కాకపోయిన నేమి? పరాయిబిడ్డయే యోగ్యుఁడుగ నగపడుచున్నాఁడు.
యశో : కుమారునిబాల్య చాపల్యమును మన్నింపుఁడు. ఇంకను ఆటప్రాయమేగదా. [రాజశేఖరునికి కనుసైఁగచేయుచు]
రాజ : నాతొందరపాటు మన్నింపుఁడు.
శాంత : నీవు మహాభారతమును చదివి మట్టు మర్యాదలు నేర్చుకొనవలయును.