పుట:2015.373190.Athma-Charitramu.pdf/647

ఈ పుట ఆమోదించబడ్డది

3, అకాలమరణము 605

3. అకాలమరణము

మా తమ్ముఁడు వెంకటరామయ్య కుమాళ్లు ముగ్గురిలోను సూర్యనారాయణ కనిష్ఠుఁడు, మేధావంతుఁడును. అతనికి గొన్ని సంవత్సరములనుండి యేమికారణముచేతనో కాని దేహము పాలిపోవుచువచ్చెను. ఇపుడు 1930 వ అక్టోబరులో చెన్నపురిలో బి. యల్. పరీక్షనిచ్చి, అన్నతోఁ దాను గుంటూరు రాక, సరాసరిగ భీమవరమె వెడలిపోయెను. అతనికి లోకాక తగిలి దేహస్వాస్థ్యము తప్పుచుండెనని మా తమ్ముఁడు వ్రాయుటచేత, నే నా డిసెంబరు తుదిని భీమవరము వెళ్లితిని. వెళ్లిన మఱునాఁడె నేను కుముదవల్లిలో వీరేశలింగవర్థంతి సమయమున నధ్యక్షత వహించితిని. వీరేశలింగము గారివలె మనమును కార్యశూరులమై, దేశోద్ధరణమునకుఁ గండంగవలె నని నేను వక్కాణించితిని.

భీమవరము వైద్యాలయమున సూర్యనారాయణ యపుడు 'కొంకిపురుగు' జబ్బునకు మందు పుచ్చుకొనుచుండెను. ఇంతలో వానికి నంజుగుణముకూడఁ గనఁబడుటచేత, మే మింగ్లీషు చికిత్స మానిపించి, ఆయుర్వేదవైద్యము చేయించితిమి. నరసాపురపు వైద్యులగు రౌతుల గోపాలముగారు భీమవరము వచ్చి చూచి, రోగిని నరసాపురము కొనిరమ్మనిరి. మే మంత జనవరి తుదిని సూర్యనారాయణుని దీసికొని, నరసాపురమున మా తమ్ముఁడు కృష్ణమూర్తి యింటఁ బ్రవేశించితిమి. నా భార్య, సూర్యనారాయణుని యత్తగారును కూడ నరసాపురము వచ్చిరి. చూచుచుండఁగనే యా యువకుని రోగ మతిశయించెను. ఏమంధు కాని వానికి లాభకారి కాలేదు.