పుట:2015.373190.Athma-Charitramu.pdf/246

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 208

49. సైదాపేట చదువు

విద్యార్థిదశయంతటిలోను ఈతుదివత్సరమే నా యారోగ్య విషయమున నధమకాలము. సైదాపేటలో నే నుండినయేఁడాది పొడుగునను, నేను రోగపీడితుఁడ నగుచునేయుంటిని. దీనివలన నావిద్య కెంతో భంగము కలిగెను. రెండవ యర్ధసంవత్సరమున కుటుంబముతో నుండిన లాభము నే నంతగఁ బొందలేదు. నా వ్యాధిగ్రస్తతఁ జూచి, నామీఁద జాలిగొని, నాచదువుచెప్పుపని తేలికచేసినప్రథమోపాధ్యాయునిసాయమే నాకు విషమించెను ! ఆంధ్రవిద్యార్థుల కావిద్యాలయమున చదువు చెప్పుట కొప్పగింపఁబడు తెలుఁగుబాలురతరగతులు చిన్నవిగ నుండెను. ఇంగ్లీషు చెప్పుటకు నా కీయఁబడిన మూఁడవతరగతిలో నైదారుగురే విద్యార్థు లుండిరి. పిమ్మట నాకు పని కలిగిన చిన్న పాఠశాలలో నిద్దఱు విద్యార్థులే కలరు. ఆవేసవియెండలకో, నాబోధనమహిమముననో, వీరిద్దఱును తరగతిలో నిద్దురపోయెడివారు ! రెండవ యర్ధసంవత్సరమున వ్యాధి ముదురుటచేత నొకవిద్యార్థి మాత్రమే కల తెలుఁగుతరగతి నా కీయఁబడెను. ఆరోగ్యము చేకూరినపిమ్మటఁ గూడ, నాకు కొలఁదిమందిగల చిన్న తరగతులే సంప్రాప్త మయ్యెను. ఇట్లు నే నాకళాశాలలోఁ గడిపిన యేఁడాదియు తగినంత విద్యాబోధనానుభవమును సమకూర్చుకొన లేకపోయితిని. బోధించుటకు అధిక సంఖ్యగల పెద్దతరగతులు తమ కీయుఁ డని తోడిబోధకవిద్యార్థులు గురువులను బీడించుచుండఁగా, నాకోరిక యెపుడును స్వల్పసంఖ్యగల తరగతులు గావలయు ననియే !

ఈకారణములవలన నేను విద్యాబోధన కౌశలమునందు వెనుకఁ బడియుంటిని. కావుననే సంవత్సరమునందు రెండుమూఁడు సారులు