ఆత్మ చరిత్రము 198
యసమ్మతిని గంటకించిన వీరేశలింగముపంతులుగారు మాతో వచ్చుట కిష్టపడలేదు. కావున కనకరాజు నేనును మెట్కాఫ్దొరదగ్గఱకు వెళ్లి మా నూతనపాఠాశాలనుగుఱించి సవిస్తరముగ మాటాడితిమి. దొరతనమువా రిఁక ముందు రాజమంద్రిలో నున్నతపాఠాశాలావిద్యను తమ చేతులలోనికే తీసికొందురనియు, కావున మాపాఠశాల కచట నవకాశము లే దనియు, ఆయన చెప్పివేసిరి ! మఱునాఁడు నాలుగవ జూలై తేదీని, మే మిరువురమును పంతులుగారి కీవార్త తెలిపితిమి. ఎన్ని కష్టముల నైన సహించి, పాఠశాలను స్థాపించి, అందు మేమందఱమును పని చేసెదమని పంతులుగారితోఁ జెప్పివేసితిమి.
6 వ జూలై తేదీని, మద్రాసు ప్రయాణము తలపెట్టుకొంటిమి. ఈమాఱు భార్యతో నే నచటికి బయలుదేఱితిని. గంగరాజు కామేశ్వరరావులు వారిపత్నులతోఁ బ్రయాణ మయిరి. గోదావరి దాటుటకు మే మందఱమును స్టీమరురేవునకు వచ్చునప్పటికి, మాకు వీడుకోలొసంగుటకు పంతు లచటికి వచ్చి వేచియుండెను. ఆస్తికవిద్యాలయములోఁ బని చేయుదు నని జెప్పినపు డాయన మిగుల సంతోషభరితుఁ డయ్యెను.
మిత్రు లందఱమును గూడి పోవుచుంటిమి గాన, మాకుప్రయాణ కష్టము గానఁబడలేదు. కంభము సమీపమందలి గుహలు వనములు పర్వతములు మున్నగు సుందరదృశ్యములు మా కనులకుఁ బండుగు చేసెను. ఎనిమిదివతేదీని మద్రాసు చేరితిమి. భార్యతో సైదాపేటలోఁ గాపుర ముండి, అన్న గారికి భోజనసదుపాయము చేయవలె నని కామేశ్వరరావు అదివఱకు సంకల్పించుకొనియుండెను. గంగరాజు నాకంటెను నిదాన మెఱుఁగని వేగిరపాటు గల మనుష్యుఁడు. ఇపు డాతని యాలోచనచొప్పున, గంగరాజు కామేశ్వర