ఆత్మచరిత్రము 70
కాని, ఆయనతో నేను పలుసారులు సంభాషించుట కిపుడు వలనుపడెడిదికాదు. ఆయన పరీక్షాపత్రములు దిద్దునప్పుడు ఒక నెల మే మాయనతోఁ బ్రసంగింపరాదు. ఇదిగాక, ఆకాలమం దాయన ఏలూరి లక్ష్మీనరసింహముగారి యభియోగములలోఁ జిక్కుకొనియుండుటచేత, పలుమాఱు న్యాయవాదులతో మాటాడుచును, న్యాయ సభల కేగుచును నుండెడివాఁడు. పంతులవంటి సంస్కర్త, సమదర్శి, సత్యసంథుఁడును, సామాన్యజనుల వగపువెఱపులకు లోనగుచు, వ్యక్తిగతకక్షలు సాధించుటకై న్యాయస్థానముల కెక్కుచుండుట, నాకే కాదు, సంస్కారప్రియులగు నామిత్రులకును నెంతయు నసమంజసముగఁ దోఁచెను ! నా స్నేహితులలో నొకఁడు, తానే పంతులవలె సంస్కర్తయై తనమీఁద వ్యాజ్యెము వచ్చినచో, ఆయనవలె న్యాయసభలు చొచ్చి, అందు న్యాయముఁ బడయఁగోర ననియు, న్యాయాధిపతి తనకు విధించునన్యాయమగు దండనమే మౌనమున నంగీకరించి, వలసినచో, కారాగారమున కేగెద ననియును, పలుకుచుండెడివాఁడు ! ఇట్టితలంపులలోఁ గొంత పటుత్వము లేకపోలే దని మే మనుకొనెడి వారము ! ఆ ఫ్రిబ్రవరి 11 వ తేదీని, నేను వెంకటరావు మాటాడు కొనుచు, వీరేశలింగమహాశయుని సమకాలికులముగ నుండుభాగ్యమనుభవించు చుండుమేము, వారిజీవితమునుగుఱించిన యమూల్యసత్యములను సంపాదించి, ఆ యుదారపురుషునిచరిత్రము లోకమునకుఁ బ్రకటిత మొనరించుట మా ముఖ్యధర్మ మని తలంచితిమి. ఆనెల 16 వ తేదీని నేను నా పూర్వస్నేహితుఁడగు శ్రీతోలేటి వెంకట సుబ్బారావుగారిని సందర్శించితిని. వీరేశలింగముగారిచరిత్రము తాను వ్రాయుచుంటి నని యాయన చెప్పెను. నా కిది మిగుల విపరీతముగఁ దోఁచెను. కొలఁదిదినములక్రిందటనే యీసంగతినిగుఱించి వెంకట