పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/43

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

మాకరాజును, వెంకప్పనాయఁడు ననువారు. వీరినిఁ బ్రతిఘటించి వీరి దుష్ప్రయత్నములను భగ్నపఱచి శాశ్వతమైన విజయకీర్తిని గాంచినవాఁడు యాచమనాయఁడు. ఇతఁడు పద్మనాయకకులాభరణము,వేంకటగిరిపురాధీశ్వరుఁ డయిన వెలుగోటి యాచమనాయనిమనుమఁడు. కాళహస్తిపురాధీశ్వరుఁ డయిన దామర్ల వెంగళనాయని దహోత్రుఁడు. ఇతనితండ్రి కస్తూరి రంగప్పనాయఁడు. తల్లి వేంకటాంబ. వీ రెల్లరును 1586 మొదలుకొని 1614 వ సంవత్సరము వఱకు విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీవీర వేంకటపతి దేవమహారాజ సేనాపతులును నాతని సేవించెడుమండలాధీశ్వరులు నై యుండిరి. సత్యము, నీతి, న్యాయముఁ దప్పకుండ ధర్మపరిపాలనముఁ జేసి విజయనగరసామ్రాజ్యసింహాసన మధిష్టించి వాసిఁ గాంచినవారిలో నీతఁ డొక్కఁడు. ఈతఁ డెంతటిసామ్రాజ్యసంపదలతో దులతూఁగు చున్నను సంతానాపేక్షతో నాఱుపర్యాయము లార్గురుపడతులను వివాహముచేసికొన్నను సంతానసౌభాగ్యమునుఁ గన్నులారఁ జూచుకొనుభాగ్యము మాత్ర మబ్బినది కాదు. ఇతనికి వేంకటాంబ, రాఘవాంబ, పెదఓబమాంబ, పినఓబమాంబ, కృష్ణాంబ, కొండాంబ అను భార్య లున్నట్టు లీయార్వురనామములు శాసనములవలన నైన నేమి గ్రంథముల వలన నైన నేమి, తదితరలేఖలవలన నైన నేమి దెలిసికొన