పుట:1857 ముస్లింలు.pdf/50

ఈ పుట ఆమోదించబడ్డది

పరిస్థితులలో మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా కన్నుమూశారు.

ఆ తరువాత స్వదేశీ పాలకులలో మాతృభూమి పట్ల ప్రేమాభిమానాలను ప్రోదిచేసే లేఖలు రాసిన అజీముల్లా ఖాన్‌ గురించి చెప్పుకోవాలి. కాన్పూరు యోధుడు నానాసాహెబ్‌ పక్షాన పోరాటాల వ్యూహరచన చేసి శత్రువుతో అవిశ్రాంతంగా పోరాడిన ఆయన నానాసాహెబ్‌కు కుడిభుజంగా ఖ్యాతిగాంచారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నానా సాహెబ్‌ సాగించిన పోరాటాలకు మాత్రమే కాకుండా ఇతర స్వదేశీ పాలకులు సాగించిన పోరాటాలకు కూడా ఆయన ప్రేరణ అయ్యారు. యుద్ధవ్యూహ నిపుణుడు మాత్రమే కాకుండా అక్షర యోధుడిగా కూడా ఖ్యాతిగాంచిన అజీముల్లా స్వదేశీ పాలకులకు పలు లేఖలు రాస్తూ అందులో ఆంగ్లేయుల విూద పోరాటం సాగించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

అజీముల్లా ఖాన్‌ స్వయంగా పయామే ఆజాది అను పత్రికను నడిపి ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులకు ఉత్తేజపూరితమైన మార్గదర్శనం చేశారు. ప్రజలలో దేశభక్తి భావనలను పెంపొందించేందుకు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టేందుకు పయామే ఆజాది పత్రికను హిందీ, ఉర్దూ భాషల్లో ప్రచురించారు. మరాఠి భాషలో కూడా ఆ పత్రికను నడిపేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ పత్రికలో '..భారతీయ హిందువులారా, ముస్లింలారా లేవండి. సోదరులారా లేవండి. దైవం మనిషికి ఎన్నో వనరులను ఇచ్చాడు. అందులో విలువైనది స్వాతంత్య్రం..' అంటూ మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ప్రజలకు ఇచ్చిన పిలుపును ప్రచురించారు.

మాతృదేశాన్ని అద్భుతమైన రీతిలో కీర్తిస్తూ, బానిస బంధనాల నుండి విముక్తి కోసం పోరుబాట నడవమంటూ అలహాబాద్‌ తిరుగుబాటు నేత మౌల్వీ లియాఖత్‌ అలీ రాసిన పైగాం-యే-అమల్‌ అను ప్రబోధ గీతం పయామే ఆజాది పత్రికలో ప్రచురిత మైంది. ఈ గీతం ఆనాడు అలహబాద్‌ ప్రాంతంలోని ప్రతి ఒక్కరి నాలుక విూద ఉత్సాహపూరితంగా నర్తించింది.

భయమెరగని ఆడపడుచులు

ఆంగ్లేయుల ఆధిపత్యానికి గండికొట్టి మాతృభూమిని పరాయిపాలకుల నుండి విముక్తం చేయాలన్న దృఢ సంకల్పంతో అనాడు పలువురు మహిళలు పోరుబాటన సాగారు. బహదూర్‌ షా జఫర్‌ భార్య జీనత్‌ మహాల్‌ భర్త వెంటసాగారు. భర్తను ఆంగ్లేయులు