ఈ పుట అచ్చుదిద్దబడ్డది
250 సింహాసన ద్వాత్రింశిక
బొట్టకొలఁదిగఁ బోంట్లకుఁ బోసిపోసి
పరిణమించిరి యొండొండఁ దరుణులెల్ల. 259
సీ. ఈవారుణీరసం బీశుండు దన కది
సమకూరకునికి విషంబు ద్రావె
మధువైరి యగుట నీమధువున కెడరయ్యు
హరి మాధవాఖ్యను శరణుసొచ్చె
నీసుర లేక గంగాసార మున్న యా
తలఁజేరెఁ జంద్రుండు బలుపుదక్కి
యీమదిరాస్వాద మెడలి విఘ్నేశుండు
పొగులఁగా లోలోనఁబొట్టయుబ్బె
ఆ. నిట్టిమద్యము గని పట్టి త్రావఁగలేక
శక్తిసేవ సేసె షణ్ముఖుండు
అనుచుఁ జతురయైన యతివ మైరేయంబుఁ
బొగడుచుండ నొక్క పొలఁతి వలికె. 260
క. పరిమళముఁ గొన్నయంతనె
పరవశమై మేను హర్షభరితం బగు నీ
సుర గలుగ నమృతమునకున్
సుర లంబుధిద్రచ్చి రిట్టిచోద్యము గలదే. 261
వ. అనవుడు నొక్కరు. 262
క. సుఖములతల్లి మనోభవు
సఖి యీసుర దొల్లి శుక్రుశాపంబున స
న్ముఖులకు నెడగాకుండిన
నఖిలజనులచేత దక్కునా మన కనినన్[1]. 263
- ↑ నిఖిలజనులచేతఁ దక్కనేర్చునె మాకున్