పుట:సత్యభామాసాంత్వనము.pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

సత్యభామాసాంత్వనము

     మరునిచే నున్నపొన్నపూదురుసుకిరుసు
     చెనకులకు నోడి ధృతి వీడి చిగురుఁబోఁడి.

చ. వనజదళాక్షి గోల యదువల్లభ దుర్లభతావకాంఘ్రినే
     [1]వనజనితానురాగభరవల్గదనంగదశాకృశాంగియై
     వనరుచునున్న దింతులను వంతలఁ బెట్టుట పాడి యౌనె యే
     పని యెడఁ గల్గినా చెలులఁ బాయనివైపున నుండఁగాఁ దగున్.

తే. ఏమి తెల్పితినో యని యెంచవలదు
     బాల యిఁక నొక్కక్షణ మైనఁ దాళలేదు
     ద్వారకకు నంపఁదగునట్టివారి ననిపి
     చంచలాక్షిని వడిగ రప్పించవలయు.

చ. మన విటు లేను దెల్పి తనుమానము సేయక చిత్తగించు నా
     ఘనతయు నాప్రసిద్ధియు జగంబున నంద ఱెఱుంగఁగా మదిం
     దనియక చెందుచు న్నవసుధారస మొల్కెడునాదుపల్కులన్
     విని తల యూఁచనట్టిపృథివీవరు లెవ్వరు కంసశాసనా.

వ. అని యివ్విధంబున విన్నవించిన పంచవర్ణకీరంబునకు సంతసించి
     మఱియును వినుతించి మగుడ ననిచి యంతకుమున్న తనకు సమయోచితా
     లాపంబులఁ బ్రొద్దుగడపిన సమీర మయూర సారంగ కలహంస కలరవ
     సురభి శశాంక మకరాంకముఖనిఖలపరిజనంబులంగాంచి వీరు తమపేరు
     వాసికి వేఱు వాసి యుండక తమ యింగితం బెఱింగి పలికి రని విజయ
     మాద్రేయసైనేయులం జూచి మందలించి కందళించినయానందంబు గ్రందు
     కొనఁ దమచిత్తంబులు చల్లఁజేయువాఁడు వీఁడెయని చిత్తజావతారమహో
     దారుం డగు రుక్మిణీకుమారుం గాంచి సకలకళాభిరామయగు సత్యభామం
     దోడితె మ్మని నియోగించి యంభోధితరణంబు నతిత్వరితాభిగమనంబు
     నుద్దేశించి యుచితచిరత్నం బగునొక్క శిరోరత్నంబు నిచ్చి యచ్యుతుం
     డనిపె ననిపిన యప్పు డారత్నం బద్భుతంబుగా ననరఘ్యమణిఘృణిధోరణీదేదీ
     ప్యమానం బగునొక్కదివ్యవిమానంబై పొల్చె. పొల్చిన నందు నిలిచి

  1. వనజతాంతరాగ