పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxvi

1935లో కీ. శే. టి. శివశంకరంపిళ్లెగారు తమ అళియరామరాజు పుస్తకములో శుకసప్తతిలోని కృత్యాదిపద్యాల నుదాహరించినది చూచి వారి కవి యెచ్చటఁ లభించెనో వ్రాసి తెలుసుకొని వారిని తొందరపెట్టి మరల పంపుదునని నమ్మకముకలిగించి కృత్యాదిపద్యాలను తెప్పించుకొంటిని. అనంతపురముజిల్లా కదిరితాలూకాలోని పాతర్లపల్లె గ్రామనివాసులగు శ్రీ అంబటి వేంకటరమణప్పశ్రేష్ఠిగా రనువారివద్దనుండి యాపద్యాలప్రతిని శ్రీపిళ్లెగారు సేకరించి పంపించిరి. మార్చి 1935లో వానిని నేను వ్రాసిపెట్టుకొని శ్రేష్టిగారిప్రతిని తిరుగ పంపితిని, “నా ప్రతిలోని పద్యాలను ముద్రించునప్పుడు నా పేరు ప్రకటింపుకొనుడు” అను శ్రేష్ఠిగారి కోరికను పరిపాలించినాను.

శుకసప్తతి 17 వ కథలో

“అంతలోననె శాలివాహనుదివాణమునకు నేఁగుటకై బంధుజనుల గొలువ.” అనియు, నందే “ధర శాలివాహనుండను” అనియు కవి వర్ణించినాడు. శాలివాహనుని కాలపు కథాసరిత్సాగరమునుండి కథలను పెక్కింటిని స్వీకరించినట్లు ఇవి సూచించును.

ఇప్పుడు లభించిన భాగమునుబట్టి కవి నాల్గాశ్వాసములలో (70) రాత్రులలో కథలను చిలుకకు చెప్పించెననియు స్పష్టమైనది.

ఆంధ్రవాఙ్మయమున విశిష్టస్థానమును బొంది శిరీషకుసుమపేశలమై గులాబీ గుమగుమలతోఁ గూడినదై, ఉత్తమహాస్యరసభరితమై, అత్యంతానందమును కలిగించు ఈ శుకసప్తతి సర్యజనాదారణీయమనుటలో నతిశయోక్తి లేదు.