పుట:విక్రమార్కచరిత్రము.pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

5

'అక్కజమై మహార్థనివహంబు సదుక్తులు మెచ్చఁ జూచినన్
గ్రుక్కిదమైన సత్కృతి యగుర్పగుఁ గాకిలఁ జీకు లావుకం
ద్రొక్కినయట్లు నోరఁగొలఁదుల్ పురికొల్పఁగ నందులోన నొ
క్కొక్కఁడు సక్కనైనగృతియుం గృతియందురె? వాని మెత్తురే!'

(కుమా. సం. ఆ. 1-38)

జక్కన తరువాతవారిలో ముఖ్యముగాఁ జేమకూర వేంకటకవి కూడ యీ మతమువాఁడే. రఘునాథరాయ లతని కవిత్వము నిట్లు కొనియాడెను.

'ప్రతిపద్యమునందుఁ జమ
త్కృతి గలుగం జెప్పనేర్తు, వెల్లెడఁ బెళుకౌ
కృతి వింటి మపారముగా,
క్షితిలో నీమార్గ మెవరికిన్ రాదు సుమీ!'

(విజ. విలా. ఆ. 1-50)

ఈ కవులు కావ్యము నందలి 'ప్రతిపద్యము' నందును ‘జమత్కృతి' గలుగునట్లు కావ్యము రచింపవలె నను అభిప్రాయము గలవారు. ఈ విషయమున వీరికి మతభేదము లేదు.

'ప్రతిపద్యము చోద్యముగాఁ గృతిఁ జెప్పిన నొప్పు' నను జక్కనమాట కేవలము కుకవినిరసనైకపరిమితప్రయోజనము కలది కాదు. విక్రమార్కచరిత్రము నతఁడు ప్రతిపద్యచమత్సృతిగా రచించి తన పంతము నిలుపుకొనినాఁడు. కావుననే జక్కన కవిత్వ మనిన సిద్ధమంత్రికిఁ బ్రీతి. ఈ విషయమును కవి యీ క్రింది షష్ట్యంతపద్యముచేత సూచించెను.

'అక్కాంబానందనునకు
ధిక్కృత సురరాజమంత్రి ధీవిభవునకున్
దిక్కూలంకషకీర్తికి
జక్కనకవి కావ్యకరణ సత్ప్రియమతికిన్.' (ఆ. 1-81)

చేమకూర వెంకటకవి రమునాథభూపాలుని గూర్చి పలికినట్లు ఈ జక్కనకవి గూడ-

తారసపుష్టియైఁ బ్రతిపదంబున జాతియు వార్తయుఁ జమ
త్కారము నర్థగౌరవముఁ గల్గ ననేకకృతుల్ ప్రసన్నగం
భీరగతిన్....