పుట:విక్రమార్కచరిత్రము.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

37

గుచకుంభములమీఁది కుంకుమపంకంబు
        పరిమళంబులతోడఁ బరిచరింప
గంధవహనామవిఖ్యాతి గణన కెక్కు
నించువిలుకాని వేగువాఁ డేఁగుదెంచి
యిగురుఁబోఁడుల గమిరాక యెఱుకపఱిచె
సరసనుతుఁడైన యారాజచంద్రమునకు.(ఆ. 7-83)

పై పద్యము జక్కన, తిలకంబు కస్తూరివాసన, సిరమైన పచ్చకప్పురముతో బెరసిన తమ్ములమ్ము తావి, మఱియు గుచకుంభముల మీఁది కుంకుమపంకంబు పరిమళంబు మున్నగువాని సామూహికపరిమళముతో గంధవహుఁ డేఁగుదెంచి యా రాజచంద్రునకు జిగురుఁబోడుల గమి రాక యెఱుకపఱచినట్లు వర్ణించెను.

పెద్దన యిందలి కస్తూరి మఱియుఁ బచ్చకప్పురపుఁ బరిమళమును గ్రహించి తమ్ములమ్ముని గూర్చి యా తావిని మారుతమున కాపాదించి, 'మగువ పొలుపుల దెలుపు నొక్క మారుత 'మొలసెన్' అని తక్కిన మూఁడు కందపాదములను జటిలసంస్కృతసమాససంఘటిత మొనర్చి సాహిత్యమున సాటిలేని సౌరథములు వెదచల్లునట్లు క్రింది పద్యమును రచించి మించెను.

మృగమదసౌరభవిభవ
ద్విగుణితఘనసారసాంద్రవీటీగంధ
స్థగితేతరపరిమళ మై
మగువపొలుపుఁ దెలుపు నొక్కమారుత మొలసెన్ . (మను.చ. ఆ.2-24)

జక్కన చేసిన ఈ క్రింది పర్వతవర్ణన :

కనియె నతండు శంకరశిఖాశశిరంజితచంద్రకాంతసం
జనితజలార్ద్రకల్పతరుజాలముఁ గిన్నెరకన్యకాప్రమో
దనమణిశృంగిసంగతలతావనజాలము దివ్యవాహినీ
వనజవనీతలద్రుహిణవాహమరాళము మేరుశైలమున్. (ఆ. 5-74)
లోలతఁ గాంచె నాసుగుణలోలుఁడు చారుశిలాగళజ్ఝరీ
జాలతటీప్రవాళఘనసత్తరువాటముఁ బార్శ్వతుంగభ
ద్రాలహరీవినోదవిహరజ్జలశీకరనిర్గతశ్రమో
ద్వేలహరప్రణామ మతిదీపితకూటము హేమకూటమున్. (ఆ. 2-218)
అనవిని విక్రమార్కవిభుఁ డప్పుడు చారుఁడు మున్నుగాఁగ వే
చనికనియెన్ సమాధిగతసంయమిరత్నవినూత్నపేటమున్
ఘనమదహస్తిహస్తపరికంపితసాసుగతాగవాటముం
గనదురు రత్నవచ్చిఖరకమ్రకిరీటముఁ జిత్రకూటమున్. (ఆ. 5.74)