పుట:విక్రమార్కచరిత్రము.pdf/309

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

261


చ.

ఇలువడి వీటిఁబుచ్చి, హృదయయేశ్వరునిం గనుఁబ్రామి, బోటులం
దలఁపక, కన్నతండ్రికినిఁ దల్లికి నాడిక దెచ్చి, చీఁకటిన్
వలపులరాజుమాయఁ బడి వచ్చిన దానికి నింత పెద్దయే!
వలనుగ బ్రహ్మము న్నొసల వ్రాసినవ్రాతఫలంబు దప్పునే?

152


క.

పుటపుటనగు చనుఁగవపై
బొటపొటఁ గన్నీరు దొరఁగఁ బురపురఁ బొక్కం
దటతట గుండియ లదరఁగఁ
గటకట యిది నోముఫలముగా కేమనుచున్.

153


ఉ.

ఓరువరానివంతఁ దలయూఁచును, నుస్సని వెచ్చ నూర్చు, మీఁ
దారయ లేనికూర్మి యిటు లయ్యెఁగదే! యని పొక్కు; వెంట నె
వ్వారలు వత్తురో యనుచు వచ్చినమార్గము చూచి, వానియా
కారము మెచ్చి మైమఱచి కౌఁగిటఁ జేర్చు మనోజవేదనన్.

154


వ.

అప్పు డక్కళేబరంబు భూతావిష్టం బగుటయు.

155


క.

క్షోణీసురవరు బొందికిఁ
బ్రాణము వచ్చెనని యిచ్చ భావించుచు, న
య్యేణిలోచన సుమనో
బాణపరాధీనహృదయపంకజ యగుచున్.

156


క.

కరతాడన గళరవములం
బరిరంభణ చుంబనములఁ బైఁబడి పెనఁగన్
ధరణిసురశవభూతము
కరిగమనం బట్టి ముక్కు గఱచె మొదలికిన్.

157


ఆ.

ముక్కు శవమునోరఁ జిక్కినమాత్రాన
విడిచి భూత మపుడు వెడలిపోయెఁ
దెగువతోడ మొదలిమగఁ డున్నచోటికి
నాతి వచ్చెఁ జుప్పనాతివలెను.

158