పుట:విక్రమార్కచరిత్రము.pdf/300

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

విక్రమార్కచరిత్రము


సీ.

కాంచిలోఁ జిరకీర్తిఁ గాంచి మించినయట్టి
        శ్రీగుప్తుఁ డనియెడు సెట్టిపట్టిఁ
గాంచనపురియందు గణనకెక్కినయట్టి
        ధనగుప్తునకుఁ బ్రాణదయిత నేను
రమణమై రాగతరంగిణి యనుదాన
        నత్తవారింటికి నరుగుచోట
నిచ్చోట మ్రుచ్చుల నిడదవ్వులనె గాంచి
        పతియు సహాయులుఁ బాఱిపోవ


తే.

నశ్రుపూరంబు చూపుల కడ్డపడిన
బ్రమసి మతి తప్పి పడితి నీప్రాఁతనూత
నింతలో వచ్చి మీరెల్ల నెదురుకొంటి
రెత్తుకొంటిరి నాప్రాణ మేమిచెప్ప.

105


ఉ.

ఇంచినవేడ్కతోడ నను నేనుఁగుకొమ్మున దాదిఱొమ్మునం
బెంచినతల్లిదండ్రులకుఁ బ్రేముడి నాయెడఁ బాయకుండు నే
గాంచికి నేగి వారిఁ బొడగాంచిన నంగద వాయుఁ గాన, న
న్నించుక యాదరించి కర మేదెడునట్టుగఁ జేయరే దయన్.

106


వ.

అనిన ననుకంపాతరంగితాంతరంగు లైన యప్పథికు లిట్లనిరి.

107


చ.

బలవదసహ్యసింహశరభప్రముఖోగ్రవనాంతభూమి ని
మ్ముల నిను డించిపోయెదమె ముంగి లెఱుంగని ముద్దరాల, వా
వలఁ బని యేమి గల్గిన నవళ్యము నిన్నును దల్లిదండ్రులం
గలపకపోము, కంచి యది కంచియె మాకు బయోరుహాననా!

108


క.

అనునయవాక్యంబులచే
ననునయముం బ్రియము నొదవ నప్పథికవరుల్
తనవారికంటె మిక్కిలి
దనవారితనంబు దనరఁ దనుఁ బలుకుటయున్.

109