పుట:విక్రమార్కచరిత్రము.pdf/295

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

247


ఘనబలాకుంఠితకంఠీరవప్రౌఢిఁ
        గొమరారు భృత్యువర్గములతోడఁ
నాశాకరీశుల నపహసింవఁగ నోపు
        గంధసింధురసముత్కరముతోడఁ
బవమానుజవనత్వ మవమానపఱుపంగఁ
        జాలెడు నుత్తమాశ్వములతోడఁ


తే.

గమలసంభవసము లైనకవులతోడ
గరిమ సన్మతిగల మంత్రివరులతోడ
మహిమమై వచ్చి సత్యధర్మక్షితీంద్రుఁ
డింపు రెట్టింప నల్లుని నెదురుకొనియె.

74


వ.

ఎదురుకొని తత్సమయసముచితోపచారంబులు నడపి తోడ్కొనిచని, నిజప్రధానాగారంబు విడియించి, పౌరులం బురోహితులను రావించి తదుపదిష్టదివసంబున.

75


సీ.

హితులైన నిజపురోహితులు చెప్పినయట్ల
        శోభనద్రవ్యవిస్ఫురణ గూర్చి
కడువైభవముతోడఁ గళ్యాణవేదిక
        నింపుమీఱ నలంకరింపఁ బనిచి
కర్పూరమంజరిఁ గైసేసి తెమ్మని
        సరసవిలాసిని జనులఁ బనిచి
రాజశేఖరమహారాజు శృంగారించి
        తోడ్తేరఁ దగియెడుదొరలఁ బనిచి


తే.

పరిణయాగారమునకు దంపతులఁ దెచ్చి
లక్షణోచితవైదికలౌకికాది
కృత్యములు సాంగములు గాఁగ సత్యధర్మ
మనుజనాథుండు విబుధానుమతి నొనర్చె.

76


వ.

అయ్యవసరంబున మౌహూర్తికదత్తశుభముహూర్తంబున.

77