పుట:విక్రమార్కచరిత్రము.pdf/287

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

239


చ.

పలుకులనేర్పునం జెవులవండువు చేసితి వింతసేపు, నా
పలుకు శిలాక్షరంబుగ శుభం బది శీఘ్రముగాఁగ నంతయుం
దెలియఁగఁ జెప్పు మింక భవదీయసమాగమనప్రసంగముల్
జలజదళాక్షి! యేమిటికిఁ జల్లకు వచ్చియు ముంత దాఁపఁగన్?

38


వ.

అనిన విస్మయానందకందళితమాససయు మందస్మితసుందరవదనారవిందయు నై, యయ్యిందువదన క్షమాపతినందను నవలోకించి, యామూలచూడంబుగా మదీయవిజ్ఞాపనంబు దత్తావధానుండవై చిత్తగింపుమని యిట్లనియె.

39


సీ.

వివిధవైభవముల విలసిల్లుపట్టున
        శ్రీలకెల్ల నవంతి మేలుబంతి
యన్నగరాధీశుఁ డధిగతపరమార్థ
        నిత్యసద్ధర్ముండు సత్యధర్ముఁ
డావిభుపట్టపుదేవి లీలావతీ
        దేవి రెండవభూమిదేవి తాల్మి
వారికిద్దఱకును వర్ణితసౌజన్య
        కర్పూరమంజరి కన్య కలుగఁ


తే.

గలిగె బాంధవతతికి భాగ్యములకల్మి
కలిగె నృపవంశమునకు శృంగారగరిమ
కలిగెఁ బ్రజలకుఁ గన్నులు గలఫలంబు
కలిగె మరురాజ్యలక్ష్మికి గౌరవంబు.

40


తే.

మొదలిపక్షంబు విదియయం దుదయమైన
చంద్రరేఖయుఁబోలె నాచంద్రవదన
దినదినంబునఁ గళలందుఁ దేజరిల్లు
సఖులనేత్రచకోరికాసమితి యలర.

41


సీ.

మొదలిసిగ్గులనిగ్గుఁ బొదరించు కనుమించు
        తొంగలిఱెప్పలఁ దొంగలింప