పుట:విక్రమార్కచరిత్రము.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

20

రసము - వర్ణనలు

ఇందలి కథ లన్నియును నాశ్చర్యాపాదకము లగుట నిందలి యంగిరస మద్భుతము. వీరశృంగారాదు లితరము లంగరసములు. విక్రమార్కుఁడు రక్కసులతోఁ బోరిన సందర్భములందు వీరము చవి చూపింపఁబడినది. ద్రౌపదిని పాంచాలరాజు పార్థునకు భార్యగా యజ్ఞమునఁ బడసినట్లు, విక్రమార్కునకు భార్యగా నొసఁగుటకై విదర్భరాజు వరమునఁ బడసిన అనంగవతినిఁ బెండ్లాడఁ గోరి విదర్భపై దండెత్తిన ప్రతినాయకుఁ డగు సిద్ధపురరాజుపై విక్రమార్కుఁడు దండెత్తిపోయినప్పు డుభయసైన్యములకును జరిగిన సంకులసమరమును జతురాశ్వాసము (ప. 40-128) నందు సుమారు 90 పద్యములలో నతిదీర్ఘముగఁ దిక్కన మార్గము ననుసరించి వీరరసము తొణకాడునట్లు వర్ణించినాఁడు. పిదప నీ యాశ్వాసము నందే యుద్ధమున విజయలక్ష్మిని వరించిన విక్రమార్కునకును అనంగవతికిని జరిగిన వివాహమహోత్సవమును జక్కన సమస్తవైదికలౌకికసంప్రదాయానుసారముగా (ప. 181–200) సుమారు డెబ్బది పద్యములతో గడుమనోహరముగా వర్ణించియున్నాఁడు. వివాహానంతరము విక్రమార్కుఁడు భార్యతో నిజపురప్రవేశ మొనరింపఁగాఁ బురస్త్రీలు రాజును జూడవచ్చుట మున్నగునవి శృంగారప్రధానముగా ప్రబంధమార్గమున వర్ణింపఁబడినవి. అనంతరము సూర్యాస్తమయ, చంద్రోదయవర్ణనములు కలవు. పిమ్మట కేళీగృహతల్పగతుఁ డయి రాజుండఁగా సఖు లనంగవతిని శయ్యాగృహమునకుఁ దోడితెచ్చుట మొదలుకొని విక్రమార్క భూపతి 'ప్రసవశరశాస్త్రమతకళాపారంగతత్వము' మఱియు 'చతురశీతికరణప్రౌఢి' సంచర్శనపర్యంత (ప. 200-225) మభివర్ణింపఁబడినది. పంచమాశ్వాసము మొదటి 60 పద్యములలో అనంగవతీవిక్రమార్కుల ప్రమదావనవిహార, లీలాశైలారోహణ, డోలారోహణ, పుష్పాపచయ, జలకేళీ వ నాదులు శృంగారప్రధానముగఁ బ్రబంధఫక్కినిఁ గావింపఁబడినవి: విక్రమార్కుఁడు యుద్ధయాత్రకు బయలుదేరుటకు ముందు చతుర్ధాశ్వాసాదిలో అనంగవతి సౌందర్యవర్ణనము (ప. 18-18), వర్షర్తు (ప. 28-85), శరదృతు (88-89) వర్ణ నలును, పంచమాశ్వాసము మొదట వసంతర్తువర్ణనమును గావింపఁబడినది. ఇ ట్లించుమించుగా చతుర్థాశ్వాసము మొత్తమును మఱియుఁ బంచమాశ్వాసము మొదటి 60 పద్యములను గలిపి ముద్రించిన యెడల నిది యొక ప్రత్యేకప్రబంధమే కాఁగలదు. కావున రాయలయుగవు ప్రబంధరచనకు మార్గదర్శకు లయినవారిలో జక్కనయు నొక్కఁ డనుట నిక్కము.