పుట:విక్రమార్కచరిత్రము.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

18

VIII. అష్టమాశ్వాసము :-
(1) మూడవసారి కళావతి మౌనమును భంగము చేయుటకయి విక్రమార్కుఁడు సువర్ణకలశముచేతఁ జెప్పించిన పద్మావతి, గుణవతి, లీలావతి యను నక్కసెల్లెండ్రగు మువ్వురు రాజపుత్రికల యొక్క “అనంగశాస్త్రవైదగ్ధ్యము"ను బ్రదర్శించు కథ. ఈ కథమాత్రము అసభ్యము, అవినీతికరము కూడ. కాని కధాకావ్యములఁ గొన్నింటను క్షేత్రమహాత్మ్యకావ్యములందుఁ గొన్నింటను నిట్టి సభ్యేతరకథాంశములు గోచరించుచుండుట వలనను, లాక్షణికశిఖామణి యగు దండి దశకుమారచరిత్రము నందును నిట్టి వుండుటవల్లను నీ కావ్యములలో నిట్టి వుండుటయు నొక సంప్రదాయ మని యూహింపవలసి యుండును(?). మఱియు నీ కథాకావ్యములు సాధారణముగా భారతాదుల వలె విజ్ఞానదాయకములుగా నుండుటకంటె వినోదదాయకములుగా నుండునవిగా నుద్దేశింపఁబడినవగుటయు నిందులకుఁ గారణాంతరముగా నూహింపవచ్చునేమో!

పైఁ గథాంశములను బరిశీలించినచో నీ విక్రమార్కచరిత్రము నందు సుమా రొక యిరువది కథ లున్నట్లు మసము తెలిసికొనగలము. అంతమాత్రముచేత దీని మహాకావ్యత్వమున కెట్టిలోపమును సంక్రమింపదు. మహాకావ్యము నందు భిన్నకథ లనేకము లుండుట దోషము కాదనుటకు మహాకవి కాళిదాసు “రమువంశ" మే ప్రబలతార్కాణము. ఇంతేకాక రఘువంశము నందు ఒకే వంశమునకుఁ జెందిన 22రు రాజుల వర్ణనాంశములు కలవు. ఇందట్లు గాక ఈ యిరువది కథాంశములును నాయకుఁ డగు విక్రమార్కుని గుణౌదార్యాదులను బ్రశంసించునవే యగుట నిందు వస్తైక్యత కలదనుటలో సందేహము లేదు. హరవిలాసమును నిట్టిదే కదా!

కథానాయకుని గుణగణములు

ఏతత్కావ్యనాయకుఁ డగు విక్రమార్కుఁడు పౌరాణికపురుషుఁడు కాక చరిత్రప్రసిద్ధుఁడు. విక్రమశక మితనిపేరఁ బుట్టినదే. సాహసపరాకమౌదార్యాది గుణసంపత్తిచేత లోకోత్తరుఁడు. నిజఫాలతలాగ్రచర్మమును ఖడ్గముతో జీల్చి చూపిన విక్రమార్కుని సాహసమున కచ్చెరువంది బ్రహ్మయిట్లు ప్రశంసించెను.

“ఆర్వురు చక్రవర్తులు పదార్వురు రాజులు విశ్వధారణీ
నిర్వహణప్రభావమున నేర్పరులైనను, వీని సాటియే
సర్వఫలప్రదానమున సాహసికత్వరమాసమగ్రతన్
గర్వితవీరవైరిచయఖండనమండనవిక్రమక్రియన్.(ఆ. 2–84)