పుట:విక్రమార్కచరిత్రము.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

13


ఈ దేవరాయలు మొదటి దేవరాయలు. ఇతఁడే సిద్ధనకుఁ బోషకుఁ డనియు, జక్కనయు నీ కాలమువాఁడే అనియు శ్రీ శేషయ్యగారు కూడ వ్రాసిరి. శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారును, శ్రీకొ. వేం. లక్ష్మణరావుగారును జక్కన మొదటి దేవరాయల కాలమువాఁడే యని నిశ్చయించిరి.

చామనామాత్యుఁడు మొదటి దేవరాయలకు మఱియు రెండవ (ప్రౌఢ) దేవరాయలకడ మంత్రిగను, దండనాయకుఁడుగను నుండెననియు, గృతిపతియగు సిద్ధనమంత్రి చామనామాత్యునిచే చామరచ్ఛత్రాది రాజలాంఛనములు పొందియుండినవాఁడనియుఁ గావున జక్కన కవి కూడ ఉభయ దేవరాయల కాలమున అనఁగా 1404-1447 సంవత్సరముల మధ్యకాలమున నుండియుండుననియు, అందును ముఖ్యముగాఁ బ్రౌఢ దేవరాయల కాలమున విద్వత్రశస్తి నొందియుండుననియు శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుగారి అభిప్రాయము.

తిక్కన పోషకుఁడగు (నెల్లూరి) మనుమసిద్దికి తండ్రియైన తిక్కరాజే తిరుకాళచోడుఁ డనియు, నితఁడు కవిసార్వభౌమబిరుదాంకితుఁ డగు పండితప్రభువనియు, నీతఁడే జక్కన తాత యగు పెద్దయామాత్యుని గారవించి యుండుననియు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు వ్రాసిరి.

పెద్దయామాత్యుని గౌరవించినది మనుమసిద్ధి తండ్రికాక మనుమసిద్ధి కుమారుఁ డగు ఇమ్మడి తిరుకాళవిభుఁడని శ్రీ చాగంటి శేషయ్యగారు తెలుపుచున్నారు.

కృతిపతి యగు సిద్ధన పెదతండ్రి యని చెప్పఁబడిన వెన్నెలగంటి సూరన కవికి అగ్రహారము లొసగిన రెడ్డి వేమనరపాలుఁడు శ్రీ వీరేశలింగము పంతులుగారు చెప్పినట్లు అద్దంకి ప్రభువగు ప్రోలయవేముఁడు (1820–1850) కాఁడనియు ఇతఁడు కోమటి వేముని కుమారుఁడగు రాచవేమారెడ్డి (1420- 1424) అయి యుండునని శ్రీ అచ్యుతరావుగారి అభిప్రాయము.

సూరన కవికి అగ్రహార మొసఁగినవాఁడు ప్రోలయ వేమారెడ్డియే అని కవితరంగిణికర్త.

పైవిషయములనుబట్టి పండితులమధ్య ఏకాభిప్రాయము కుదరలే దనుట స్పష్టము. ఈ విషయ మింకను బరిశోధింపఁదగియున్నది. కావున జక్కన కవి శ్రీనాథ మహాకవికి సమకాలికుఁ డనియు విక్రమార్కచరిత్రము పదునేడవ శతాబ్ది ప్రథమపాదాంతమున రచింపఁబడి సిద్ధనమంత్రికిఁ గృతి యొసఁగఁబడినట్లు స్థూలముగ మనము తలంపవచ్చును.