పుట:విక్రమార్కచరిత్రము.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

10

బరమహృద్యంబైన పద్యశతంబున
                  దేవకీతనయు విధేయుఁ జేసె
రసికత్వమున దేవరాయమహారాయ
                  కరుణాకటాక్షవీక్షణముఁ గాంచెఁ
గర్ణాటకటకముల్ గలయంతయును మెచ్చ
                  గణకవిద్యాప్రౌఢి ఘనతకెక్కె
గురులఁ బోషించె సత్కవివరుల మనిచెఁ
బ్రజలఁ బాలించె భాగ్యసంపద వహించె
హరితమునిముఖ్యవంశరత్నాకరేంద్ర
చంద్రుఁడై యొప్పు సిద్ధయజన్నమంత్రి.

పై పద్యమువలన ముఖ్యముగా నీ జన్నమంత్రి శ్రీకృష్ణునిపై వంద పద్యముల శతకకావ్యమును రచించినట్లును, దేవరాయల కటాక్షమునకుఁ బాత్రుఁ డయ్యెననియు, మఱియు గణకవిద్యయందు మిగులఁ బ్రసిద్ధి గాంచెననియుఁ దెలియుచున్నది. ఇందు స్పష్టముగఁ జెప్పఁబడకున్నను 'ప్రజలఁ బాలించె ననుటచే నీ జన్నమంత్రి దేవరాయలకు మంత్రిగా నుండినట్లు భావింపఁబడుచున్నది. (ఆ.1.46) ఇతరమంత్రులు జన్నమంత్రికి సరిరారని కవి నుడివియున్నాఁడు.

సిద్ధమంత్రి :- జన్నమంత్రి ప్రథమసుతుఁడు. ఈయనయే విక్రమార్కచరిత్ర యొక్క కృతిభర్త. జక్కనకవి యితనిఁ బ్రశంసించిన పద్యము దిగువ నుదహరింపఁబడుచున్నది.

చిత్రగుప్తునకైనఁ జింతింపనరుదైన
                  గణితవిద్యాప్రౌఢి ఘనత కెక్కె
నవరసంబులయందు నవ్యకావ్యంబులు
                  కవిజనంబులు మెచ్చగా నొనర్చె
నాణిముత్తెములసోయగము మించినవ్రాలు
                  వరుసతో నిరుగేల వ్రాయ నేర్చె
నాత్మీయిలిపులట్టు లన్యదేశంబుల
                  లిపులను జదువంగ నిపుణుఁ డయ్యె
దేవరాయమహారాయ ధీవిధేయ
మంత్రివల్లభ చామనామాత్యదత్త
చామరచ్ఛత్రశిబికాది సకలభాగ్య
చిహ్నముల నొప్పె జన్నయసిద్ధమంత్రి.(ఆ. 1-50)