పుట:రామాయణ విశేషములు.pdf/81

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

31

యజ్ఞములయందు హింస యుండుటచే యజ్ఞధ్వంసి యయ్యెను. కాని యతడు వేదమతద్వేషియనియు, మునిహింసకుడనియు వాల్మీకి తన కలముయొక్క మసిచే రావణుని ముఖమును నల్లగా చిత్రించెను. లక్ష్మణునకు ఎనమండ్రు పట్టపు భార్యలట, 16 వేలు పై పెండ్లాలట! ఈ గుంపు నంతయు భాగవతమునందు శ్రీకృష్ణులవారి కంటగట్టినారు ఈ బేరసార మేపౌరాణికునివలన జరిగెనో దురూహ్యము. ఇచ్చట లక్ష్మణుడే గరుడ వాహనుడు. చక్రి, రావణాంతకుడు. మఱియు నారాయణాపరావతారుడు. ఇందు మారీచుడు లేడు. బంగారుజింక మొదలేలేదు. ఇందలి వంశావళులు వాల్మీకులవారి వంశావళులతో భిన్నించుచున్నవి. శంబూకుడు శూర్పణఖ యొక్క పుత్రుడనియు నతనిని లక్ష్మణుడు వధించెననియునిందున్నది. శంబూకుడను శూద్రతపస్విని రాముడు ఖండించెనని యుత్తర రామాయణమున నున్నది. శూద్రుల తపస్సు అంత యోర్వరానిదై యుండెనేమో? “దశముఖ” యను పదమున కుత్పత్తిహేతు విందు సమంజసముగా గనబడుచున్నది. జైన రామాయణ మందు కుంభకర్ణుడును, ఇంద్రజిత్తును మరణించలేదు. మరియు సంజీవిపర్వతమును హనుమంతుడు తెచ్చెనన్న దిచట కల్ల. భామండలుడు (ఇతడెవడో?) అమృతమును దెచ్చెననియున్నది. రావణుడు మహేశ్వరునిగూర్చి తపస్సుచేసెననియు అతని చేతులదురదవదలునట్లు కైలాసముపై బొటనవ్రేలితో శివుడే యదిమెననియు మనము వినినసంగతి. ఇందు వాలిచే నదుమబడెనని యున్నది. మఱియు నీ జైన రామాయణములో నహింసా విషయమును, రావణుని యజ్ఞ ధ్వంసకత్వమును తెలుపుట జైన సిద్ధాంత ప్రచారమునకై చేసిన మార్పని స్పష్టమగుచున్నది మహేశ్వరునకు మారుగా నిచ్చట ప్రతి ఘట్టమందు జిననాథుని పేర్కొనియున్నారు. ఇదియు మత ప్రచారార్థమేయై యుండనోపు. ఈ రామాయణములో విశ్వసనీయ విషయము లనేకములున్నవి. వాల్మీకి రామాయణమందు రాముడాదర్శ పురుషుడు. ఏక పత్నీవ్రతుడు. రావణుడు పరమ దుర్మార్గుడు. ఇది