పుట:రామాయణ విశేషములు.pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

రామాయణ విశేషములు


దేశి విదేశి పురాణాలు

ఈ చర్చను ముగించుటకు పూర్వ మొక సూచనను చేయదలచినాను. జైన బౌద్ధమత వ్యాప్త్యనంతరము ఇంచుమించు ఒక వేయి సంవత్సరములవరకు స్వార్థపరులు తమతమ భావాలను ప్రచారము చేయుటకై పురాణములలో కల్పిత కథలను, భావాలను, నీతులను దూర్చి పెంచుచు వచ్చిరని పలువు రభిప్రాయపడినారు. అందుచేత మన కాలములో పురాణాలకు విలువ తగ్గెను. పురాణాలలో అతి పురాతన చారిత్రికాంశములిమిడి యున్నవి. మన పరిశోధకులు-ఇంగ్లీషు సంస్కృతము బాగా నేర్చినవారు - కేవలము మన సంస్కృత పురాణాలనే కాక విదేశీయ పురాణాలనుగూడా తారతమ్య దృష్టితో (Comparative Study) చదువవలెను. ఆర్యావర్తమందు ఆర్యుల సంస్కృతి, నాగరికత, విజ్ఞానము ఒక దిక్కు విజృంభించుచుండగా ఇంచుమించు అదే విధముగా కొంత కాలముతర్వాత ఈరాన్, బాబిలోనియా, హట్టి, అసీరియా, ఛాల్డియా, ఫినీషియా, సిరియా, గ్రీసు, ఈజిప్టు, (మిశ్ర దేశమునందలి నీలనదీ ప్రాంతములో) రోముదేశములలో నాగరికత పెంపొందుచు వచ్చెను. పై దేశాలలోను పురాణాలు రచింపబడెను. వాటిలో విశేషభాగము ఇంగ్లీషులో లభించుచున్నవి. వాటిని మన పురాణాలతో సరిపోల్చు దృష్టితో చూచుచు వచ్చిన, మన పురాణాలలోని విశ్వామిత్రుడు, భృగువు, పరశురాముడు, బలరాముడు వాల్మీకి మున్నగు వారికి ఆ దేశాలతో ఏమైన సంబంధముండెనో యేమో తెలియరాగలదు. ఆ దేశాల చర్చ మన పురాణాలలో కనబడవచ్చును.