పుట:రాధామాధవసంవాదము (వెలిదిండ్ల వేంకటపతి).pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

రాధామాధవసంవాదము


గీ.

ఒకటఁ గొఱతయు లేక నే నున్నదాన, నైన నావిన్నపం బిపు డాదరింపు
నీదుపట్టపుదేవులు నేను నీవు, బంతిభుజియింపవలె రేపు సంతసమున.

153


చ.

అని మఱునాడు వారికిఁ బ్రియంబుగ సమ్మతి గాఁగ శౌరిచే
తనె పిలిపించి వారలును దానును గృష్ణునిఁగూడి బంతులై
యనువుగఁ బంచభక్ష్యపరమాన్నములన్ జవు లెంచికొంచు భో
జన మొనరించి ధౌతకరసారసలై ముదమంది రందఱున్.

154


మ.

నవరత్నస్థగితంపుసొమ్ములను నానాగంధపుష్పాదుల
న్నవరంగత్కనకాంబరంబులను గాంత ల్వింతలై చేరి చు
ట్ల వసింపం గొలువున్నమాధవునిదండ న్నిల్చి యారాధ మ
క్కువతోఁ బల్కెను గప్పురంపునునుబల్కుల్ దళ్కులం జిల్కఁగన్.

155


మ.

పొలుపౌ రుక్మిణిసత్యభామలకు నీపూఁబోండ్ల కాయున్నక
న్నెలకు న్నేఁ జెలికత్తెనై తెలిపెదన్ వీరల్ భవత్ప్రీతికై
కలహం బందఁగ నేల? పంచి వరుసల్ గల్పించి గోపాల వీ
రలరన్ దిట్టము చేసి చేసెదను మాధ్యస్థంబు నే నియ్యెడన్.

156


చ.

ఒకనెల కొక్కమేర వినుఁ డున్నదినంబులలోఁ బదాఱువే
లకును బదాఱునాళు; లవల న్మఱి యార్గురి కాఱునాళ్ళు నొ
క్కొకటిగ లక్షణాదులకు నొప్పగు; సత్యకు రెండునాళ్లు; నం
దుకు నొక టెచ్చు రుక్మిణికిఁ దోఁచినచో దయ నిల్పు వెల్తికిన్.

157


గీ.

అనుచు నోయక్కలార నే నంటి ననుచుఁ, గోప ముంచకుఁ డీమేర కొదువ గాదు
సమ్మతిలుఁ డంచు సతులమొగమ్ముఁ జూచి, హరికి మొదలుగ రాధ యందరకు మ్రొక్క.

158


క.

కూర్చుండు మనుచు రాధం, గూర్చి పడంతుకలు మెచ్చుకొనుచుం బ్రియముం
గూర్చి పలుకంగఁ గృష్ణుఁడుఁ, గూర్చుండఁగ నిడియె నవ్వుకొనుచుం జెంతన్.

159


ఉ.

అంతట వారి వారిని గృహంబులకున్ సెలవిచ్చి రాధికా
కాంతను గృష్ణదేవుఁడు తగనే గరఁగించి చెలంగి వింతకున్
వింతలుగాఁ దమిన్ వరుసవెంబడి నందఱయిండ్ల కేఁగి య
త్యంతవిలాసమార్గముల దక్షిణనాయకుఁ డయ్యె నున్నతిన్.

160


క.

విను రాధామాధవకృతి, మనమున నిడి వినినఁ జదివి మఱి వ్రాసిన మె
చ్చిన యాధన్యాత్ములకున్, వనజాక్షుఁ డొసంగు సకలవైభవము దయన్.

161