పుట:భాస్కరరామాయణము.pdf/234

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంబు విడిచి పోవం గోరెద ననుజ్ఞ యిం డని యారామలక్ష్మణులచేత ననుజ్ఞాత
యై తన్ను నగ్నిదేవునికి నాహుతి సేసి దివ్యమూర్తి వెలుంగుచుఁ దమగురువు
లున్న స్వర్గలోకంబునకు నాశబరి సనిన రామలక్ష్మణు లాశ్చర్యంబుఁ బొంది యా
శబరిస్థానంబును గడచి పంపాభిముఖు లై యేఁగుచు నాతపస్వులసామర్థ్యంబు ద
లంచి రాముండు లక్ష్మణునితోడ ని ట్లనియె నియ్యాశ్రమంబునకు సప్తసముద్ర
తీర్థంబులం దెచ్చి యధికతపంబులు సలిపి రమ్మహామును లిట్టిపుణ్యస్థానంబు సేరి
పితృసంతర్పణంబులు సేసి కృతార్థుల మైతిమి వర్షశతంబు లైన నుండ నర్హం
బైనపుణ్యస్థానం బిది యైన మనము గార్యాసక్తులము గాన ఋశ్యమూకాచలం
బున కేఁగి రవిసుతునకు హితం బాచరించి సీత వెదకంగఁ బోవలయు ననుచు
నయ్యాశ్రమంబు గడచి యేతెంచి ముందట.

420

పంపాసరోవరవర్ణనము

సీ.

కూలచంపకనారికేలసాలరసాల, తాలహింతాలతక్కోలతరులు
తీరభూజారూఢహారీతటిట్టిభ, కీరకోకిలకాకకేకికులము
సారసకలహంసచక్రబకక్రౌంచ, కారండవాలాపకలకలంబు
కైరవేందీవరకల్హారకువలయ, పుండరీకాంభోజపుష్పతతులు
నింగి కుప్పొంగురంగత్తరంగసంచ, యములు నిందిందిరలసితవిమలవారి
మత్స్యకచ్ఛపోరగశింశుమారచటులు, జలచరమ్ముల కలఁకువల్ గలుగుదాని.

421


మ.

ప్రవిలాసాంచితసద్గభీరవిమలాంభఃపూరసంసేవ్యమార
సవిహంగోత్కరసమ్మదావహమహాశుక్రశ్రితాభ్యంతర
సవిశేషోర్మితరంగసంకులజనశ్లాఘ్యప్రభావన్ సరః
ప్రవరంబుం గని రానృపాత్మజులు పంపం బెంపు సొంపారఁగన్.

422


వ.

కని యచ్చెరు వందుచుం జేర నరుగునప్పుడు.

423

పంపాతీరంబున రాముండు విరహవేదనచే విలపించుట

క.

[1]సరసిజకువలయపరికర, పరిమళపరిమిళితశిశిరపావనరంగ
త్తరళతరంగాంబుకణో, త్కరధరమలయానిలంబు దనపైఁ బొలయన్.

424


సీ.

సౌమిత్రి నామీఁద సారెసారెకు నవ్య, కుసుమముల్ గురిసెడుఁ గుజము లోలి
నవచూతవల్లిక న న్నదె సన్నలు, సేయుచున్నది లీలఁ జిగురుఁగేల
మధురస్వరంబుల మదకోకిలంబులు, సేరెడుఁ బలుమాఱుఁ జెలఁగి చెలఁగి
కరి కరేణువుఁ జేరి కరమునఁ బుడికెడు, హరిణంబు సనియెడు హరిణివెంట

  1. సీ. ఆసరోవరమునం దానృపాలాత్మజు, లతిశయస్నానపానాదివిధులు
         ప్రియమునఁ జలిపి సంప్రీతాంతరంగు లై, తత్సమీపోన్నతతరుచయంబు
         శీతలచ్చాయ నాసీనులై కొండొక, యలసట దీఱంగ నచట నిలిచి
         సౌఖ్యంబు నొందిరి సత్సేవ్య మైనయీ, యారణ్యకాండంబు నర్థితోడ
         వినినఁ జదివిన వ్రాసిన విస్తరించి, చెప్పినను వారలకు సౌఖ్యసిద్ధి యగును
         సంపదాయురారోగ్యముల్ సంభవించు, నఖిలపుణ్యంబు లెప్పుడు ననుభవింత్రు.