మఱియు నఖిలజీవులయందు[1] గృపాలుండవై సత్యంబు దప్పక
సర్వదేహులయందు సమత్వంబు భజియించి పరోపకారబద్ధ
కచ్ఛుండవై కామాహతబుద్ధిసమేతుండవై నిత్యశుచిత్వంబు
నొంది పరార్ధవిత్తాదులయం దీహమాని మితాహారభోజనుండవై
ధైర్యంబు దప్పక శత్రుషడ్వర్గజయంబు కలిగి మత్పరాయణుండవై
మత్పూర్వకథితకర్మంబుల నాచరింపుచుఁ దత్ఫలంబు మదర్పణంబు
గాఁ జేయుచు వర్తింపుచు మద్భక్తుండు భాగవతజనదర్శనస్పర్శ
నార్చనంబులను, దత్పరిచర్యానుకీర్తనంబులను మజ్జన్మకర్మకథనంబు
లను, మత్కథాశ్రవణంబునను మత్సన్నిధానంబునం ప్రవర్తించు
గీతతాండవాదిత్రాదిమహోత్సవసందర్శనంబులనుం గోరుచు మచ్చే
ష్టుండై మచ్చరణుండై దేహపతనపర్యంతంబు పరిభ్రమించి
యంత్యకాలంబున మదూపధరుండై మత్సాయుజ్యంబుఁ బొందు.
నివ్విధంబున వైదికతాంత్రికరూపంబులైన మదీయవ్రతధారణంబు
ను, మన్నిలయోపలేపనమార్జనరచనావిశేషంబులును భక్తిసమే
తుండై చేయుచుండవలయును. భాస్కరుండును, నగ్నియు, విప్రుం
డును, ధేనువును, వైష్ణవుండును, నాకాశంబును, వాయువును, నుద
కంబును, భూమియు, నాత్మయు నాఁబరఁగు నీ పదియును మత్పూజా
స్థలంబులు, ఇందు వేదంబులచేత సూర్యమండలంబును, హోమ
ద్రవ్యంబులచేత ననలంబును, నాతిథ్యంబున విప్రోత్తమును, బాల
ఘాసకబళంబులచేత ధేనువులను, సత్కారంబులచేత విష్ణుభక్తులను,
ధ్యానంబుచేత హృదయాకాశంబులను, ముఖ్యబుద్ధిచేత వాయువును
దోయపురస్కృతద్రవ్యంబులచేతఁ దోయంబును మంత్రాదులచేత
స్థండిలంబులను, బూజసేయుచు శంఖచక్రశార్ఙగదానందకాద్యా
యుధధరుండనైన నన్ను ధ్యానంబు సేయుచు సంచరింపంగవలయును.