పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/70

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

63


క.

క్రతుశాల కెక్కఁదగునే
కుతలంబున నీచమైన కుర్కురమునకుం
బతితకు చండాలాంగన
కతిదివ్యవిమాన మెక్క నర్హత గలదే.

82


చ.

వ్రతములు చేసెనో సదుపవాసము సల్పెనొ శంభునామముల్
మతి జపియించి తీరముల మజ్జనమాడెనొ దానధర్మము
ల్గ్రతువు లొనర్చెనో యిపుడ కారణమెట్లు విమానమెక్క స
మ్మతముగ నర్హతయ్యెఁ గసుమాలపు మాలకు దుష్టశీలకున్.

83


మ.

చలిపంది ళ్లొనరించెనో తెరువులన్ సత్రాన్నము ల్పెట్టెనో
కొలఁకు ల్ద్రవ్వెనొ శంకరాచ్యుతులకున్ గుళ్లేమి నిర్మించెనో
స్థలరాజంబుల కేఁగి షోడశమహాదానంబులున్ జేసెనో
భళిరా యిట్టివిమాన మెక్కనగునే పాపిష్ఠచండాళికిన్.

84


శా.

నిత్యానిత్యవివేకము ల్గలిగెనో నిష్ఠారతిం జెందెనో
సత్యోక్తు ల్పచరించెనో శివకథాసల్లాపము ల్చేసెనో
శ్రుత్వాచార్యుల విశ్వసించెనొ ముముక్షుత్వంబు సాధించెనో
యత్యంతాఘవిదూషితాంగికి విమానారోహణం బర్హమే.

85


క.

ఈవార్త తెలియఁ బలుకం
గావలయు మహాత్ములార కారుణ్యమునన్
శ్రీవిశ్వేశ్వరుమహిమలు
భావింపఁగ జగములందుఁ బరమాద్భుతముల్.

86


వ.

అని యడిగిన వారలు దద్వృత్తాంతంబంతయు నీకుం దెలియం
జెప్పెదము వినుమని యాశివకింకరు లిట్లని చెప్పం దొడం
గిరి.

87