పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/56

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

49


తే.

మిడిన దుర్మతి వీవు దైత్యుఁడవు గమ్ము
పొమ్మని శపింప నారాజపుంగవుండు
నిరపరాధుండు గావున గురున కలిగి
యపుడు ప్రతిశాప మిచ్చెదనని తలంచి.

14


క.

కోపంబున జలములు గొని
శాపం బీదలఁచి యున్నసమయంబున నా
భూపాలుని వారించెను
శాపింపక యుండ నతనిసతి శాంతమతిన్.

15


వ.

అప్పు డమ్మిత్రసహుండు నిజభార్యానుకూలుండు గావున
దద్వాక్యంబునకు సమ్మతించి కులగురుం డగువసిష్ఠమహా
మునీంద్రునకుఁ బ్రతిశాపం బిచ్చుట మాని తన ధర్మ
పత్నితో ని ట్లనియె.

16


క.

ఈపగిది నేధరించిన
శాపోదక మిప్పు డెచటఁ జల్లుదు ననినన్
నీపదముల నిడుకొమ్మని
యాపడఁతి వచింప నాతఁ డట్ల యొనర్చెన్.

17


తే.

అటుల గావింప నమ్మానవాధిపతికిఁ
దజ్జలస్పర్శనమునఁ బాదములు గమలెఁ
గాన నది యాదిగాఁగ లోకంబునందుఁ
బరఁగె నాతఁడు గల్మాషపాదుఁ డనఁగ.

18


ఉ.

అంతట నవ్వసిష్ఠుఁడు మహామతి నాత్మసమాధిఁ జూచి గో
రంతయు రాజునందు నపరాధము లేమి యెఱింగి యమ్మహీ
కాంతుఁడు రాక్షసత్వ మెసఁగ న్భువిలోపల ద్వాదశాబ్దప
ర్యంతము సంచరించి మనుజాధిపుఁ డౌనని పల్కెఁ గ్రమ్మరన్.

19