పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

41


కృష్ణాభిధానంబున నవతరించు మీకులంబు పావనం బగు
నని చెప్పి యారాజదంపతుల నాశీర్వదించి వారలం
దోడ్కొని క్రమ్మఱ నిజనివాసంబునకు వచ్చిన యమ్మహా
మునీంద్రుచరణంబులకుఁ బ్రణామంబు గావించి యవ్వధూ
వరు లమ్మహాత్ముని యనుజ్ఞ వడసి.

102


మత్తకోకిల.

రాజదంపతు లీవిధంబున రాజసంబు జనింపఁగా
రాజధానికి వచ్చి క్రమ్మఱ రాజరాజనిశాంతవి
భ్రాజితం బగునాత్మసౌధము రాజహంససముల్లస
త్తేజము ల్వెలయంగఁ జొచ్చిరి ధీరచిత్తము లొప్పఁగాన్.

103


శా.

ఆకేళీగృహమందుఁ బుష్పమయపర్యంకప్రదేశంబునన్
రాకాచంద్రముఖిన్ సరోజనయనన్ రంభాంగనారూపఱం
టాకన్ జందనచంద్రశీతలను వేడ్కన్ గౌఁగిటన్ జేర్చె నా
భూకాంతుండుఁ గళావతిన్ గుణవతిన్ బూర్ణప్రభావోన్నతిన్.

104


వ.

తదనంతరంబున.

105


చ.

లలితకళాభిమర్శనములన్ గిలిగింతలఁ గౌఁగిలింతలం
గిలకిల నవ్వుచున్ నిడుద కీల్జడవ్రేటుల గుబ్బపోటులన్
బలుమొనకాటులన్ జతురబంధములన్ వదనాదిచుంబనం
బులఁ బరితృప్తు లైరపుడు పుష్పశరాసనకేళి నిర్వురున్.

106


వ.

ఇవ్విధంబున నాదంపతులు పరస్పరప్రేమానురాగంబుల
సురతసౌఖ్యంబు లనుభవించుచుఁ బరిపూర్ణమనోరథులై
యుండుసమయంబున.

107