పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

31


క.

అని యడిగిన యమ్మునితో
జననాయకుఁ డపుడు వేడ్క జనియింపఁగ మీ
ఘనతరకారుణ్యంబున
ననిశము సర్వమును గుశల మని పల్కెఁ దగన్.

53


ఆ.

మఱియు నిట్టులనియె మనుజాధినాయకుం
డోమునీంద్రచంద్ర సేమమలర
నస్మదీయగృహమునందుఁ గొన్నిదినంబు
లుండవలయుఁ గనులపండువుగను.

54


క.

అని పలికి యమ్మహాముని
యనుమతిఁ గైకోలు వడసి యవనీపతి నె
మ్మనమున నుప్పొంగుచు నిజ
తనయఁ గలావతిని జూచి తా నిట్లనియెన్.

55


క.

అమ్మా విను నామాట ని
జమ్ముగ నిమ్మునికి వినయసత్కారములన్
సమ్మతముగ భోజనపా
నమ్ముల సంతుష్టిఁజేయు నలినదళాక్షీ.

56


తే.

ఇమ్మహాత్ముఁడు దనహృదయమ్మునందు
సంతసిల్లిన జగములు సంతసిల్లు
నట్లుకావున నన్నపానాదికములఁ
బూర్ణకాముని గావింప బొదలు శుభము.

57


క.

అని జనకుఁడు నియమించిన
వినయమ్మున సమ్మతించి విలసన్మతి ని
మ్మునిసార్వభౌముఁ బ్రమదా
వనమధ్యగరత్నభవనవాసునిఁ జేసెన్.

58