పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/348

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

341


క.

అని పలికిన యాకామినిఁ
గనుఁగొని బ్రాహ్మణుఁడు పలికెఁ గారుణ్యమునన్
వనితా హిత మగువాక్యము
వినుపించెద వినుము నీదువీనులు దనియన్.

300


మ.

తరుణీ నీ విఁకఁ దావకీనవిటలబ్ధం బైనచిత్తంబు వే
సరవోకుండఁగఁ దెచ్చి యిచ్చినను వేశ్యాస్త్రీల కే నిచ్చి త
త్సురతక్రీడల సంచరించెదను సంతోషంబుగాఁ గామత
త్పరజారావళిఁ గూడియుండుము మహోత్సాహంబు సంధిల్లఁగన్.

301


తే.

అనుచు నొడఁబాటు జెంది నెయ్యంబు మీఱ
నాదురాచారు లిద్దఱు హర్ష మొదవ
నొగి యథేచ్ఛావిహారులై యుండునంతఁ
గాలగతిఁ జెందెఁ బతి గొంతకాలమునకు.

302


క.

ఆకామినియును గామో
ద్రేకంబునఁ గొన్నినాళ్లు దిరుగుచు నంతన్
గోకర్ణక్షేత్రమునకుఁ
బ్రాకటమతిఁ జనియె నొక్కపర్వమునందున్.

303


వ.

అట్లు చని యావంజులయు నమ్మహాస్థలంబునఁ బుణ్యతీర్థం
బులయందుఁ గృతస్నాతయై విభూతిలిప్తఫాలభాగయు
రుద్రాక్షమాలికాధారిణియు నయి యొక్కశివాలయంబు
నకుం జని ప్రదక్షిణనమస్కారంబు లాచరించి యచ్చటఁ
బౌరాణికుండయిన యొక్కవిప్రుండు పురాణపఠనం బొన
రింపుచున్నం గాంచి తానును దత్సభాసదులతోడఁ గలసి