పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/338

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

331

భద్రసేనుసభకు నారదమహాముని వచ్చుట

ఉ.

పారదశారదాభ్రహిమభానుసుధాఘనపాండురాజసా
కారుఁడు పాకశాసనముఖత్రిదశస్తుతసచ్చరిత్రుఁడు
న్వారిజగర్భనందనుఁ డవార్యమహామహిమానుభావుఁ డా
నారదమౌని వచ్చె నటనంబులు సల్పుచు వీణె మీటుచున్.

257


తే.

ఇట్లు విచ్చేయుమునిపతి కెదురువచ్చి
యర్ఘ్యపాద్యాదిసత్కృతు లాచరించి
విమలకాంచనపీఠోపవిష్టుఁ జేసి
పలికె నరపాలుఁ డంజలీబద్ధుఁ డగుచు.

258


ఉ.

మీరు మహాతపోధనులు మిత్రసమానులు సర్వలోకసం
చారులు పుణ్యమూర్తులు నిజంబుగ నద్భుత మైనవార్త లే
మారసి చూచి వచ్చితిరొ యంతయు మా కెఱిగింపుమన్న నా
నారదమౌని పల్కె నరనాథునిఁ జూచి విచిత్రవైఖరిన్.

259


సీ.

మునిపుంగవులు నీవు వినుఁడు భూపాలక
        యొకవార్త వినుపింతు నుల్ల మలర
భవదాత్మజుని గతప్రాణునిఁ గావింపఁ
        దలఁచి మృత్యువుతోడ దండధరుఁడు
చనుదెంచి యుండ నాసమయంబున శివుండు
        దెలిసి కోపాగ్నిప్రదీపుఁ డగుచుఁ
దనపుత్త్రు వీరభద్రునిఁ బంప నాతండు
        ప్రమథయుక్తముగ శీఘ్రముగ వచ్చి


తే.

త్వత్సుతాలంబచిత్తుఁ గృతాంతుఁ బట్టి
యాక్షణంబునఁ బెడకేల నంటఁగట్టి