పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/328

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

321


వ.

ఇట్లు దృఢనిశ్చయుం డై యున్న యతనియభిప్రాయం
బెఱిఁగి యవ్వేశ్యయుఁ బురబాహ్యప్రదేశంబునఁ జితి
గావించిన నవ్వైశ్యుండు సూర్యోదయానంతరంబునఁ గాల్య
కరణీయంబులు నిర్వర్తించి యచ్చటికిం జనుదెంచి శంకర
పదధ్యానం బొనరింపుచుఁ బ్రజ్వలితాగ్నికిఁ బ్రదక్షిణత్రయం
బొనరించి సకలజనంబులు కనుంగొనుచుండ నందుఁ
బ్రవేశించె నంత నవ్వనితయుఁ దన్మరణంబునకు బాష్ప
పూరితలోచన యై నిర్వేదించి నిర్మలం బయినధర్మంబు
మనంబున విచారించి తాను నవ్వైశ్యునితోడ ననుగమ
నంబుఁ జేయుదునని నిశ్చయించి నిజబంధుజనంబుల నవ
లోకించి యి ట్లనియె.

207


తే.

ఇతనిచే రత్నకంకణ మే గ్రహించు
సమయమున సూర్యచంద్రైకసాక్షికముగ
బాస యిచ్చితి నే నీకు భార్య నగుదు
మూఁడహోరాత్రములటంచు ముదితలార.

208


క.

కావున దైవవశంబున
నీవైశ్యుఁడు మృతిని బొందె నిపు డట్టుల నీ
పావకుముఖమున నేనును
నావల్లభుతోడఁ గూడ నరిగెద ననినన్.

209


వ.

అపుడు వార లి ట్లనిరి.

210


మ.

తగునే వారవధూటికి న్విటులతోఁ దా వహ్ని సొత్తేరఁగా
నగరే తోడికులాంగనామణులు విన్నం బూర్వ మేదైన ని
జ్జగతిన్ బెద్దలు చెప్పఁగా వినము నీచారిత్ర మత్యద్భుతం
బగు నోహో యిఁకఁ జాలు నెక్కడివి వేశ్యాస్త్రీలకున్‌ సత్యముల్.

211