పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/311

ఈ పుట ఆమోదించబడ్డది

304

బ్రహ్మోత్తరఖండము


        ధనవంతుఁడును గృతోద్వాహుఁ డగుచు
నున్న వాఁ డిచటికి మున్నూటయిరువది
       యోజనంబులదూర ముర్వియందు


తే.

నాద్విజన్ముసమాగమం బందుచుండు
స్వప్నసమయంబులందు నీచంచలాక్షి
యంతమీఁదట వేదవేదాంతతత్త్వ
ధన్యుఁ డైనట్టి యొక్కనందనునిఁ గాంచు.

138


వ.

అని యమ్మహామునీంద్రునకుఁ దెలియంబలికి శారదం గాంచి
గౌరీదేవి యి ట్లనియె.

139


మ.

యువతీ పూర్వభవప్రసిద్ధపతిసంయోగాప్తి నీయందు సం
భవమున్ జెందుఁ గుమారుఁడొక్కరుఁడు రూపఖ్యాతుఁ డామీఁదటన్
ధ్రువమాంగల్యత నీవిభుం గలసి సంతోషంబు వర్థిల్ల నీ
భువిలోన న్విహరించి శాంకరపదంబున్ జేరు మారూఢిగన్.

140


క.

అని నిర్దేశించి జగ
జ్జనని తిరోహితము నొందె సంయమివర్యుం
డును శారదచేఁ దగఁ బూ
జన మంది నిజేచ్ఛ నరిగె సమ్మదలీలన్.

141


వ.

తదనంతరంబ ప్రభాతసమయమున నాశారదయుఁ గాల్య
కరణీయములు నిర్వర్తించి వ్రతాంగం బైనహోమము
గావించి కుటుంబసంపన్నులును శ్రోత్రియులు నైన
బ్రాహ్మణజనములకు గోభూహిరణ్యాదిదానములును వస్త్ర
కలశద్వయసమేతములైన ప్రతిమాయుగ్మములును దానము
లొనరించి బ్రాహ్మణసమారాధనములు గావించి తదా
శీర్వాదములు గైకొని తానును విఘసాన్నప్రాశనయై