పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/310

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

303


నిరాశుండై కొంతకాలమునకుఁ దదీయధ్యానపరాయణ
త్వమునఁ గాలవశత్వమునం జెంది క్రమ్మఱ విప్రకులమున
సంభవించి యీజన్మమున దీనిం బాణిగ్రహణము గావించి
యావిధంబున నిధనంబు నొందె నిమ్మత్తకాశినియుఁ బతివ్రత
యగునిజసపత్నికి భర్తృవియోగం బొనరించెం గావునఁ
దద్దోషమున నీభవమున నిట్టిదురవస్థ ప్రాప్తించె నని
యానతిచ్చి యమ్మహాదేవి వెండియు ని ట్లనియె.

134


తే.

ఆద్విజన్మకులావతంసాగ్రపత్ని
పతివియోగాభితప్తయై పలవరించి
కాలగతిఁ జెంది భుజగియై క్రౌర్యమునను
గలుషమతి దీనిభర్తను గరచి చనియె.

135


క.

సతిపతుల కెడలు వాపిన
యతివలు కౌమారసమయమందులను విని
ర్గతభర్తృకలై యుందురు
సతతమును ద్రిసప్తజన్మసముదయమందున్.

136


మ.

విను మీశారద పూర్వజన్మమున నుర్వీదేవతాపత్ని యై
నను బూజించుట నిమ్మహావ్రతము సానందంబుగాఁ జేయుట
న్నిను లోకోత్తరునిన్‌ భజించుటను ఖండీభూతదుర్దోషయై
ఘనకల్యాణముఁ జెందఁగాఁ గలదు నిక్కం బారయన్ భూసురా.

137


సీ.

ఆభామహృదయేశుఁ డగు భూసురేంద్రుండు
       దనపత్ని మదిలోనఁ దలఁచి తలఁచి
కొంతకాలంబున కెంతయుఁ దనమేను
       విడిచి క్రమ్మఱఁ బాండ్యవిషయమునను
విప్రుఁడై జన్మించి వేదశాస్త్రజ్ఞుండు