పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/296

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

289


వ.

ఇవ్విధంబున నమ్మహారణ్యముం బ్రవేశించి యచ్చటం బర
తెంచు వేదండగండకపుండరీకభల్లూకవరాహమహిషాది
దుష్టమృగముల విదళింపుచు విహరింపుచున్నసమయమునఁ
దద్భటుం డయిన యొక్కశబరుండు చండకుం డనువాఁడు
మృగాన్వేషణపరుం డై వనమునం దిరుగుచు నొక్కయెడ
జీర్ణం బైనదేవాలయమునందు స్ఫుటితం బయినలింగము
గావించి దైవనియోగమున దానిం గొనిదెచ్చి యారాజ
నందనునకుం జూపి యిమ్మహాలింగమున కేను బూజనం
బొనరించెద దీనిం బూజించువిధానం బెట్టిది సవిస్తరముగా
నానతీయవలయు నని ప్రార్థించినశబరునకుఁ బరిహాసముగా
నారాజకుమారుం డి ట్లనియె.

71

చండకుండను శబరోపాఖ్యానము

సీ.

ఇమ్మహాలింగంబు నెమ్మితోఁ బూజించు
        క్రమ మెఱిఁగింతు సాంగంబు గాఁగ
విను మీవు సంకల్పవిధిపూర్వకంబుగా
       నవవారి నభిషేచనం బొనర్చి
యొప్పుగాఁ బీఠమం దునిచి యాపిమ్మట
       నతిశుభ్రపుష్పగంధాక్షతముల
నర్పించి ధూపదీపాదికంబు లొసంగి
       నెమ్మదిలోన ధ్యానమ్ముఁజేసి


తే.

మొదలఁ జితిభస్మ ముపహారముగ నొనర్చి
యంత నాత్మోపయుక్తాన్న మాదరమున
మరల నైవేద్య మొనరించి మంత్రపుష్ప
వందనాదులు గావింపవలయు నెపుడు.

72