పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/286

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

279


గలఁ డొక్కరుండు సత్కర్మపరిత్యాగి
        చౌర్యవర్తనుఁ డనాచారపరుఁడు
శూద్రాంగనామణి సురతకేళిఁ జరింప
        నారాత్రి యొకశూద్రుఁ డరుగుదెంచి
యాయుధప్రహతిచే నావిప్రు వధియించి
        యూరికి వెలుపలఁ బారవైచె


తే.

నంత నవ్విప్రశవముపై నచట నొక్క
సారమేయంబు వచ్చి భస్మానులిప్త
పాదములఁ ద్రొక్కి చరియించెఁ బలలరక్త
ఖాదనాపేక్ష మదికి నాహ్లాదమొదవ.

25


ఉ.

ఆసమయంబునందు నరకాలయమందు వసించియున్న యా
భూసురుఁ బట్టి క్రమ్మఱను బుష్పక మెక్కఁగఁజేసి బల్మిచే
నాసమవర్తికింకరుల నందఱ మోది మహేశుదూత లు
ల్లాసముతోడఁ బోవఁగని లజ్జితుఁడై రవిసూనుఁ డిట్లనున్.

26


మ.

కులవిభ్రష్టుఁ డసత్యవాది జడుఁడున్ ఘోరుండు మూఢుండు చం
చలచిత్తుండు వివేకహీనుఁడు దురాచారుండు నైనట్టి యీ
ఖలునిం దివ్యవిమానమధ్యగతునిం గావించు టర్హంబె ని
ర్మలకైవల్యపదంబుఁ జేర్చుదురె దుర్మార్గుండు వీఁ డారయన్.

27


వ.

అని పలికిన శమనునిం గాంచి యాశంకరకింకరు లి ట్లనిరి.

28


చ.

కనుఁగొను మీద్విజన్ముశవకాయమునందు లలాటవక్షము
ల్పనుపడఁ గక్షదేశములు భస్మవిలిప్తము లయ్యె గావున
న్మనసిజవైరిశాసనమునం గొనిపోయెద మోకృతాంత నీ
మనమున సంశయింపకుము మాన్యులు గారె త్రిపుండ్రధారణుల్.

29