పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/277

ఈ పుట ఆమోదించబడ్డది

270

బ్రహ్మోత్తరఖండము


సీ.

సమయోచితముగఁ బర్జన్యుండు వర్షించె
        ఫలియించె ముక్కారు పంటపొలఁతి
వర్ణాశ్రమాచారవర్తన ల్దప్పక
        చరియింపుచుండిరి సకలజనులు
ఫలపుష్పకోరకపల్లవాన్వితములై
        యలరుచు నుండె నుద్యానతరువు
లభివృద్ధిగా నుండె నాలమందలఁ బాలు
        ప్రజలు సౌభాగ్యసంపన్ను లైరి


తే.

యీతిబాధలు మానె ధాత్రీతలమున
దేవగృహములు మిక్కిలి తేజరిల్లె
ధర్మపద్ధతి వెలయ భద్రాయు వెలమి
నవని పాలింపుచున్నట్టియవసరమున.

315


వ.

ఇవ్విధమున బహువర్షంబులు ప్రజాపరిపాలనం బొనరించి
యనంతరమున నిజనందనునకుం బట్టము గట్టి సకలమహీ
రాజ్యభారధురంధరుం గావించి కీర్తిమాలిని సమేతంబుగా
వానప్రస్థాశ్రమవిధానంబునకుఁ జని పరమేశ్వరు నుద్దేశించి
మహాఘోరతపం బాచరించి దేహంబులు విసర్జించి దివ్య
విమానారూఢులై సిద్ధగంధర్వవిద్యాధరాదులు జయజయ
శబ్దంబులం బ్రశంసింప శివలోకమునకుం జని సాయుజ్యము
నొందిరని చెప్పి సూతుం డమ్మహామునీంద్రుల కి ట్లనియె.

316


శా.

సౌఖ్యారోగ్యజయప్రదం బఘవినాశం బైనభద్రాయుషో
పాఖ్యానంబుఁ బఠించుమానవులు సౌభాగ్యంబు మీఱన్ జగ
త్ప్రఖ్యాతంబుగఁ బుత్త్రపౌత్త్రధనదీర్ఘాయుర్యశోవంతులై
ముఖ్యం బైనపదంబుఁ జెందెదరు సమ్మోదానుభావంబునన్.

317