పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/270

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

263


సీ.

అని పల్కుచున్నయయ్యవనీశువాక్యంబు
       లాలించి బ్రాహ్మణుం డనియె మరల
బ్రహ్మహత్యయు సురాపానంబు గురువధూ
       పరతయుం గనకాపహరణ మనెడి
యఖిలాఘములకుఁ బ్రాయశ్చిత్త మొనరించుఁ
       బూని మదీయతపోబలంబు
పారదారికవృత్తి పాపం బనఁగ నెంత
       నిమిషమాత్రంబున సమసిపోదె


తే.

కాన మఱుమాట లాడక ఘనత మీఱ
నీసతీమణి నిపు డిమ్ము నిశ్చయముగ
నట్లు గాకున్న శరణార్థులైనవారిఁ
బ్రోవనేరని కలుషంబు పొందు నిన్ను.

288


వ.

అని యివ్విధంబునఁ బరుషాక్షరంబులుగాఁ బలికిన బ్రాహ్మ
ణుని భాషణంబు లాకర్ణించి పాపభయంబునకు వెఱచి
యన్నరేంద్రుఁడు దనమనంబున ధైర్యం బవలంబించి
యి ట్లని వితర్కించె.

289


ఆ.

పాప మెడలిపోవ బ్రాహ్మణోత్తమునకు
మద్వధూటి కీర్తిమాల నొసఁగి
యపయశంబు దొలఁగ నగ్నిఁ బ్రవేశింతు
ననుచు నిశ్చయించె నాక్షణంబ.

290


క.

స్నానాదికవిహితాను
ష్ఠానంబు లొనర్చి మానసమునందు గురు
ధ్యానముఁ జేయుచు బహువిధ
దానము లొనరించె నపుడు దద్దయుఁ బ్రీతిన్.

291