పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/216

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

209


సీ.

ఆరాజపత్నియు నారాజనందనుం
        డత్యంతరుచిరదేహములు దాల్చి
యింద్రవైభవశతం బినుమడించినభంగి
        నతిశయానందసౌఖ్యంబుఁ గాంచి
పాదపద్మములపైఁ బడియున్న యయ్యింతి
        గనుఁగొని ఋషభుండు కరుణదోఁపఁ
బలికె నోవత్స నీ విల చిరంజీవివై
        యుందువు సామ్రాజ్యయుక్త మగుచు


తే.

నెంతకాలంబు జీవింతు వంతతడవు
నీకు ముదిమియుఁ దెవులును లేకయుండు
నీతనూజుండు విద్యాసమేతుఁ డయిన
దనుక నిచ్చోట నుండుము వనజనేత్రి.

69


క.

భద్రాశ్వకృపాపాత్రుఁడు
భద్రయుతుం డగు నటంచు బాలకునకుఁ దా
భద్రాయు వనఁగఁ బేరిడి
భద్రగతిం జనియె యోగపారగుఁ డంతన్.

70


వ.

ఇ ట్లమ్మహానుభావుం డైనఋషభయోగీంద్రుండు మృతుం
డైనరాజనందనుని మహేశ్వరమంత్రపూతభస్మప్రభావ
మునఁ గ్రమ్మఱ సంజీవితుం జేసి యథేచ్ఛాగతిం జనియెనని
చెప్పి వెండియు నమ్మహామునులకు సూతుం డి ట్లనియె.

71


మ.

మునినాథోత్తములార మీరు వినుఁ డీముక్కంటిమాహాత్మ్యము
న్మును నేఁ జెప్పినవేశ్య పింగళ యనం బొల్పారుపూఁబోడి స
జ్జనసంస్తుత్యమహాప్రభావుఁ డగునాచంద్రాంగదక్ష్మాతలే
శునిసీమంతినికిం జనించె మరలన్ శుంభత్సువర్ణాంగియై.

72