పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/198

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

191


వ.

ఇట్లు వినయవినమితశిరస్కుఁడై యున్నయారాజున కంబి
కాదేవి యి ట్లనియె.

292


క.

ఏమిటికై ప్రార్థించితి
వేమి భవత్కామితంబు లెఱిఁగింపుము నీ
కామోదంబున నొసఁగెద
నామాట నిజంబు గాఁగ నమ్ము మధీశా!

293


చ.

అనిన ధరాధినాథుఁ డను నంబికతో జగదేకరక్షణీ
వినుము ద్విజేంద్రనందనులు వేడుకఁ గృతిమదంపతిత్వముం
బనుపడ నైషధేంద్రుసతిపాలికిఁ బోయిన నావధూటి ని
న్మనమలరం భజించుకతనన్ లలనామణి యయ్యె నొక్కఁడున్.

294


క.

దేవీ సారస్వతునకు
నీవిప్రుం డొకఁడె పుత్త్రుఁ డీయెలనాఁగన్
భావింప మరలఁ బురుషుని
గావింపు మటన్న రాజుఁ గనుఁగొని పలికెన్.

295


క.

ఈవరము దక్క మఱియొక
టేవరమైనం దలంప నిత్తు నిజముగా
భూవర వేఁడు మటంచన
నావసుధేశుండు పలికె నయ్యంబికతోన్.

296


ఉ.

నీ కిది యేమిభారము గణింపఁగ నోజగదంబ తొల్లియి
క్ష్వాకుసహోదరిం బురుషసత్తముఁ గాఁగ ననుగ్రహింపవే
లోకులు నన్ను బుద్ధిచపలుం డని నింద యొనర్పకుండఁగా
నీకమలాక్షికి న్మరల నిచ్చలు బుంస్త్వ మొసంగు శాంకరీ.

297


క.

కపటాత్మకుఁ డితఁడని న
న్నపవాదము చెందకుండ నరయుచు మఱి నీ