పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/182

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

175


తే.

గాన మీలోన మీర లొక్కరుఁడు యువతి
యొకఁడు పురుషుండుగా వేష మొనర దాల్చి
పోయి యాసాధ్విమందిరంబున భుజించి
ధనము గొని రండు మత్సన్నిధానమునకు.

216


చ.

అని వచియించిన న్విని మహాభయ మందుచు విప్రసూను లి
ట్లనిరి నరేంద్రచంద్ర తగునా మిముబోంట్లకు నిట్టులాడఁగా
జనకులపట్ల దేవతలసన్నిధి సద్గురులందు రాజులం
దును గపటప్రయత్నుఁ డగుదుర్మతి దాఁ జెడు సాన్వయంబుగన్.

217


ఉ.

ఎన్నఁగ మేము భూసురకులేంద్రులమున్‌ బహువేదశాస్త్రసం
పన్నుల మిట్టికాపటికభాషణ మర్హమె మాకుఁ గైతవ
చ్ఛన్నమనుష్యసంతతికి సాధ్వసమున్ గలుషంబు వైరమున్
బన్నుగ నిందయుం గలుగు బార్థివశేఖర సత్య మారయన్.

218


వ.

నరేంద్రా భవదీయశాసనమున నిషధపురమున కెట్లు పోవ
నేర్తుము కౌటిల్యమార్గమున సంచరింపుచున్న మ మ్మెవ్వరే
నియు నెఱింగిన దండనార్హుల మగుదుము కులశీలవిద్యా
గుణములఁ బ్రయోజనము లగులజ్జాభిమానములు
దొలంగుఁ గావున నే మిట్టి కార్యమునకుం బోవుట
యర్హంబు గా దని పలికిన నవ్విప్రకుమారులవచనంబు
లాకర్ణించి వెండియు నాభూవరుం డి ట్లనియె.

219


క.

దేవ గురు జనక జననీ
భూవరశాసనము గడచు పురుషులు గలరే
యేవిధమున కర్తవ్యము
గావున నాయాజ్ఞ మీఱఁగారాదు సుమీ.

220