పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/160

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

153


క.

వనితా నీ వెవ్వరు నీ
జనకునిపే రేమి యెవరిసతి వేమిటి కై
ఘనశోకము బాల్యంబున
జనియించెను దెలియఁబలుకు సత్యముగాఁగన్.

111


క.

అని సస్నేహముగాఁ బలి
కిన యావిభుఁ జూచి యశ్రుకీలితనిజలో
చన యై లజ్జిత యగుచును
వనజేక్షణ యూరకుండె వచనరహిత యై.

112


ఆ.

అంతఁ దద్వయస్య యారాజనందను
గాంచి మధురవచనగారవమున
యావధూటిచరిత మాద్యంతయుతముగాఁ
దెలియఁబల్కె నపుడు దేటపడఁగ.

113


సీ.

ఓమహాత్మక విను మీమానినీమణి
        సీమంతిని యనంగఁ జెలువుగాంచు
నీకాంతజనకుండు లోకప్రసిద్ధిగాఁ
        జిత్రవర్మ యనంగ ధాత్రి వెలయు
నింద్రసేనుఁడు మామ చంద్రాంగదుఁడు భర్త
        నిషధాధినాథుఁడు నిక్కముగను
ఈవధూమణిపతి దైవయోగంబున
        యమునాజలనిమగ్నుఁ డయ్యెఁ గాన


తే.

నతనిరాజ్యంబు దాయాదు లపహరించి
తల్లిదండ్రులఁ బట్టి బంధన మొనర్చి
రట్లు గావున నీయింతి యధికశోక
తప్త యై యుండ వత్సరత్రయము గడచె.

114